బడంగ్పేట, సెప్టెంబర్ 19 : ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులవృత్తుల వారికి పెద్దపీట వేస్తూ ఆర్థికంగా ఎదుగడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయడంతో అవి జలకళను సంతరించుకున్నాయన్నారు. గతంలో చేపల కోసం ఆంధ్రాపై ఆధారపడేవాళ్లం. కానీ నేడు ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో కోటీ 60 లక్షల చేప పిల్లలు నీటి వనరుల్లో వదిలే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రావిర్యాల పెద్ద చెరువులో ఒక్క రోజే 5 లక్షల చేపపిల్లలను వదులుతున్నామని పేర్కొన్నారు. సొసైటీ తరఫున మరో 15 లక్షలు చేపపిల్లలు వదిలి జీవనోపాధికి బాటలు వేయడం అభినందనీయమన్నారు.
చేపల మార్కెటింగ్కు ఔట్లెట్లు, ద్విచక్రవాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం 26,778 నీటి వనరుల్లో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ ద్వారా 15 లక్షల చేప పిల్లలను వదలనుండడంతో సొసైటీ సుమారు రూ.30 లక్షల ఆదాయం పొందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని, కమిషనర్ జ్ఙానేశ్వర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.