వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో మిగతా మండలాల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు. జిల్లాలో 111 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని సేకరిస్తున్నది. గ్రేడ్-ఏ రకం క్వింటాల్కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర చెల్లిస్తున్నది. ఇప్పటివరకు జిల్లాలో 7,551 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. దీని విలువ రూ.15.55కోట్లు కాగా, 2,250 మంది రైతుల నుంచి సేకరించారు. రోజుకు 50 మంది రైతుల నుంచి ధాన్యం కొంటున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సత్వరమే చెల్లింపులు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో వానకాలం సీజన్కు సంబంధించి 75 వేల మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా.. గతేడాదితో పోల్చితే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. -వికారాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వానకాలం సీజన్కు వరి ధాన్యం సేకరణ జోరందుకుంది. కొడంగల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. మరో రెండు, మూడు రోజుల్లో తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లోని మిగతా మండలాల్లోనూ రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు వెంటనే చెల్లింపులను చేసేందుకు వీలుగా ప్రభుత్వం డబ్బులను కూడా పౌరసరఫరాల శాఖ వద్ద సిద్ధంగా ఉంచింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్మిల్లులకు సరఫరా చేసి బిల్లులు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
గ్రేడ్ ఏ-రూ.2060, సాధారణం-రూ.2040
వానకాలం సీజన్కు మద్దతు ధరను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.2060, సాధారణ రకం రూ.2040గా నిర్ణయించింది. గతేడాది వరకు గ్రేడ్-ఏ రకం రూ.1960, సాధారణం రూ.1940 ఉండేది. జిల్లాలో వానకాలం సీజన్కు 75 వేల మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా చెల్లింపులను రెండు, మూడు రోజుల్లో జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
సత్వరమే చెల్లింపులు : వికారాబాద్ కలెక్టర్ నిఖిల
జిల్లావ్యాప్తంగా ధాన్యాన్ని విక్రయించే రైతులెవరికి కూడా ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గమంతటా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లోనూ రెండు, మూడు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ దఫా సాగు పెరుగడం, భారీగా దిగుబడి రానున్న దృష్ట్యా అందుకు తగినట్లుగా గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నాం.
ఇప్పటివరకు 7551 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి
జిల్లాలో 111 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 49, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 30, ఏఎంసీ ఆధ్వర్యంలో 4, ఐకేపీ ఆధ్వర్యంలో 25, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభమైంది. అధిక మొత్తంలో సాగైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి సాగు చేసిన 4-5 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వానకాలం సీజన్లో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధం అయినట్లయితే నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఏఈవోలు రైతులకు ఏ తేదీన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలనేది తేదీతో కూడిన టోకెన్ అందజేశారు.
జిల్లాలో ఇప్పటివరకు 2250 మంది రైతుల నుంచి 7551 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 15.50 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా.. వీటిలో ఏ గ్రేడ్ రకం 7509 మెట్రిక్ టన్నులు కాగా, సాధారణ రకం 42 మెట్రిక్ టన్నులు. 2060 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించగా, మిగతా 5491 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. మరోవైపు అధిక మొత్తంలో ధాన్యం దిగుబడి రానున్న దృష్ట్యా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు 59 గోదాంలను సిద్ధం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు నాలుగు ఏజెన్సీలకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. కొనుగోలు కేంద్రాల్లో అవసరమయ్యే టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్స్, ఎలక్ట్రానిక్ యంత్రాలు తదితరాలను మార్కెటింగ్ శాఖ ద్వారా అన్ని కొనుగోలు కేంద్రాలకు సమకూర్చారు. ఈ ఏడాది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు, ఎక్కువగా పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లో సాగు చేశారు.