సార్వత్రిక ఎన్నికల పోరుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు ఇప్పటికే నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసింది. వీరికి త్వరలో శిక్షణా కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు. జిల్లాలోని 1130 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను నియమించి, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మృతిచెందిన, వలసవెళ్లిన, డబుల్ ఓట్లు ఉన్నవారు జిల్లావ్యాప్తంగా 2748 మంది ఉన్నట్లు తేల్చి తొలగించింది. రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన మరో 931 మందిని గుర్తించి తొలగించారు. ఈవీఎంల ఎఫ్ఎల్సీ(ఫస్ట్ లెవల్ చెక్) ప్రక్రియను జూన్ 1న నిర్వహించనున్నారు. కలెక్టర్తోపాటు అన్ని రాజకీయ పార్టీల ఎదుట ఎన్నికల అధికారులు ఈవీఎం పనితీరును పరిశీలించనున్నారు. ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,81,028 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లాయంత్రాంగం పేర్కొన్నది.
– వికారాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రానున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరో మూడు నెలలు మాత్రమే ఉండడంతో ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లాలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి శిక్షణకు మాస్టర్ ట్రైనర్లను జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున మాస్టర్ ట్రైనర్లను జిల్లా ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పొందిన అనంతరం జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మే మొదటి వారంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు, తదనంతరం మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణనివ్వనున్నారు. జిల్లాలోని 1130 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులను నియమించారు. ఈ దఫా పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులుగా పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు.
జూన్ 1న ఎఫ్ఎల్సీ
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంలను పరిశీలించనున్నారు. ఈవీఎంల ఎఫ్ఎల్సీ(ఫస్ట్ లెవల్ చెక్) ప్రక్రియను జూన్ 1న నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్తోపాటు అన్ని రాజకీయ పార్టీల ముందు ఎన్నికల అధికారులు ఈవీఎం పనితీరును పరిశీలించనున్నారు. ప్రస్తుతం వికారాబాద్ ఈవీఎం గోదాంలో ఉన్న ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేదనేది పూర్తిగా పరిశీలించనున్నారు. ఒకవేళ పనిచేయని ఈవీఎంలు ఉన్నట్లయితే రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదించనున్నారు. అయితే ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులు ఈవీఎంల గోదామును పరిశీలించారు. ఈవీఎంలతోపాటు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదిని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎన్నికల అధికారులు పరిశీలించారు. జిల్లాలో 1130 పోలింగ్ కేంద్రాలుండగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం యంత్రంతోపాటు అదనంగా 160 శాతం ఈవీఎంలను జిల్లాలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం 2600 ఈవీఎం యంత్రాలుండగా మరో 100 ఈవీఎలను సమకూర్చాలని నివేదించనున్నారు.
కొనసాగుతున్న తొలగించిన ఓట్ల పరిశీలన ప్రక్రియ
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రతీ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటికే తొలగించిన ఓట్లకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు పరిశీలన ప్రక్రియను చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 2748 ఓట్లను మృతిచెందిన, వలస వెళ్లిన, డబుల్ ఓటర్లున్నట్లు తేల్చి జిల్లా ఎన్నికల యంత్రాంగం తొలగించింది. వీటిలో 316 మంది ఓటర్లు మరణించినట్లు, 1501 మంది ఓటర్లు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వలస వెళ్లినట్లు గుర్తించారు. మరణించినట్లు ధ్రువీకరించి తొలగించిన ఓటర్లలో పరిగి నియోజకవర్గంలో 87, వికారాబాద్లో 76, తాండూరులో 66, కొడంగల్లో 87 మంది ఓటర్లను తొలగించారు. మరో 931 మంది ఓటర్లకు సంబంధించి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తించి తొలగించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లుగా గుర్తించిన ఓటర్ల తొలగింపుపై మరోసారి క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశించగా, డబుల్ ఓటర్లుగా ఉన్న ఓట్లను బూత్ లెవల్ అధికారులు పరిశీలన చేపట్టారు.
జిల్లాలో 8,81,028 మంది ఓటర్లు
ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,81,028 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,41,688 మంది ఓటర్లు, మహిళలు-4,38,752 మంది ఓటర్లు, ఇతరులు-26 మంది ఓటర్లు, ఎన్ఆర్ఐ ఓటర్లు-21 మంది ఓటర్లు, సర్వీసు ఓటర్లు-541 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో ఓటర్లు 2,34,652., పురుషులు 1,19,512., మహిళలు 1,14,865., ఇతరులు 8., ఎన్ఆర్ఐ 7., సర్వీసు ఓటర్లు 260 మంది ఉన్నారు. వికారాబాద్లో ఓటర్లు 2,14,523., పురుషులు 1,08,589., మహిళలు 1,05, 855., ఇతరులు 3., ఎన్ఆర్ఐ 7., సర్వీసు ఓటర్లు 69 మంది ఉన్నారు. తాండూరులో ఓటర్లు 2,15,897., పురుషులు 1,05,960., మహిళలు 1,09,875., ఇతరులు 8., ఎన్ఆర్ఐ 6., సర్వీసు ఓటర్లు 48 మంది ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్లు 2,15,956., పురుషులు 1,07,627., మహిళలు 1,08,157., ఇతరులు 7., ఎన్ఆర్ఐ 1., సర్వీసు ఓటర్లు 164 మంది ఉన్నారు.