పరిగి : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి సంఘాల సమావేశాలలో ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటీ వరకు 1766 పనులు మంజూరవగా 1157 పనులు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశలలో ఉన్నట్లు చెప్పారు. పనులలో వేగం పెంచాలని ఆమె సూచించారు. జిల్లా పరిషత్ నుంచి పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామపంచాయతీలలో వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, పనులలో జాప్యం లేకుండా చూడాలన్నారు.
ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో కేరళ వలె పచ్చదనం పెరుగాలని అధికారులకు సూచించారు. కేరళలలో ఎటు వెళ్లినా రోడ్లకు ఇరువైపుల పెద్ద సంఖ్యలో చెట్లతో పచ్చదనం ఉంటుందని, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ నిరంతరం చేపట్టడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో ఇల్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంకుడుగుంత తవ్వితేనే ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఈసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనందున పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె సూచించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. టేబుల్ టెన్నిస్ సామగ్రిని కొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉంచారని, కొన్ని పాఠశాలల్లో లంచ్ టేబులుగా వాడటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడాలని, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలు అర్హులకు అందేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. డీడీలు చెల్లించిన రైతులకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని చెప్పారు. సాధారణ నిధులు తప్ప మిగతా గ్రాంటు కింద కొత్త పనులు మంజూరు చేస్తామని చైర్పర్సన్ తెలిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ అధ్యక్షతన వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జిల్లా పరిధిలోని 18 మండలాలకు రూ. 3.47కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్లు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆయా మండలాల జెడ్పీటీసీలకు అందజేశారు. ఎలాంటి తారతమ్యం లేకుండా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, జెడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, మేఘమాల, సంధ్యారాణి, సంతోష, మహిపాల్, మధుకర్, శ్రీనివాస్రెడ్డి, రాందాస్ నాయక్, జయమ్మ, మంజుల, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.