పరిగి : మే నెలాఖరు లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పట్టణ సమీపంలోని తుంకులగడ్డలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని ఇళ్ల నిర్మాణాలు, ఎంత వరకు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. 7 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చాలా వరకు వేగంగా పనులు కొనసాగుతున్నట్లు కాంట్రాక్టర్ చెప్పారు. తుంకుల గడ్డలో 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మే నెలాఖరు వరకు పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
మొదటి విడతగా మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మరిన్ని ఇళ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు డబ్బులు అందజేసే విధంగా సర్కారు చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా తమ గ్రామంలోని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టుకోవచ్చని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, కౌన్సిలర్లు మునీర్, నాగేశ్వర్, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకుడు రవికుమార్, సేవ్యానాయక్ పాల్గొన్నారు.