ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పల్లెబాట పట్టారు. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో కార్యక్రమం పేరుతో అన్ని విభాగాల అధికారులను వెంటబెట్టు కొని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పాదయాత్రలు, సమావేశాలు, చర్చావేదికలు నిర్వహిస్తూ నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ.. సమస్యలపై ఆరా తీస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల పర్యటనలతో గ్రామాలు సందడిగా మారాయి. ఎమ్మెల్యేలే స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారే ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించేలా సరికొత్త కార్యక్రమాలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి పేరిట కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలకు సంబంధించి వినతులను స్వీకరించి దశలవారీగా పరిష్కరిస్తుండేవారు. పలు సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ గోడును తెలియజేసేవారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట ఉన్నట్లయితే అక్కడిక్కడే పరిష్కారమయ్యే సమస్యలు చాలా ఉంటాయి.
ఇదే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పల్లెబాట పట్టారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రజాప్రతినిధులతోపాటు అన్ని శాఖల అధికారులు కూడా ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారులతో కలిసి అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.
ప్రధానంగా మిషన్ భగీరథ, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు, డ్రైనేజీ, రోడ్లు, రైతు బంధు, ఆసరా పింఛన్లు, రెవెన్యూ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తున్నారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తుండడంతో అక్కడిక్కడే సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులందరికీ అందుతున్నాయో లేదో ప్రజలనడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ రోజుల కొద్దీ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయినప్పటికీ సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ, అటు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారిపోయేవారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్తూ సమస్యలకు పరిష్కారం చూపుతుండడంపై జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్లో ‘మీతో నేను’
వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ‘మీతో నేను’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటివరకు వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూరు, మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మండలాల్లోని 133 గ్రామాలకు 112 గ్రామాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పర్యటనలో ఎమ్మెల్యేతోపాటు మండల, గ్రామస్థాయి అధికారులు కూడా ఉంటున్నారు. సమస్యలను బట్టి ఆయా స్థాయిలో పరిష్కారం చూపుతున్నారు. జిల్లాస్థాయిలో సమస్యలున్నట్లయితే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి ఎమ్మెల్యే ఆనంద్ తీసుకువెళ్తున్నారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ వస్తున్నారు.
చేవెళ్లలో ‘శుభోదయం’
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుభోదయం పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రోజుకొక గ్రామంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ లికేజీ, విద్యుత్తు వైర్లు వేలాడడం, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే యాదయ్య దృష్టికి తీసుకురాగా అధికారులను ఆదేశించి అక్కడిక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం సకాలంలో అందుతున్నాయో లేదా అనే వివరాలను తెలుసుకుంటున్నారు.
తాండూరులో ‘పల్లె పల్లెకు పైలట్’
తాండూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడమే లక్ష్యంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని బషీరాబాద్ మండలం నుంచి ఎమ్మెల్యే ప్రారంభించారు. మూడు రోజుల్లో 20 గ్రామాల్లో పర్యటించడంతోపాటు ప్రజా సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం చూపుతున్నారు. రోజుకు 7 గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తాండూరు నియోజకర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.140 కోట్లను మంజూరు చేసిన దృష్ట్యా ప్రజలడిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ ఏజెంట్లను పట్టించి హీరో అయిన పైలట్ రోహిత్రెడ్డికి ఊరూరా ఘన స్వాగతం పలుకుతున్నారు.
కొడంగల్లో ‘గడప గడపకు నరేందర్ అన్న’
కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గడప గడపకు నరేందర్ అన్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం కొడంగల్ మున్సిపాలిటీలో ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. మిషన్ భగీరథ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఆసరా పింఛన్లు తదితర సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపుతున్నారు. మున్సిపాలిటీలో అన్ని వార్డులు పూర్తయిన వెంటనే మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపనున్నారు.