వికారాబాద్, నవంబర్ 26 : జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 25న విడుదలైందని, అప్పటి నుంచి డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. జిల్లాలో మొదటి విడతలో జరిగే 8 మండలాల్లో 262 గ్రామపంచాయతీలు, 2198 వార్డులు, 2198 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. నామినేషన్లు మొదలుపెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ గెజిట్ జారీ అయిందన్నారు. అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందరికీ సమానంగా వర్తిస్తుందన్నారు. నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా స్థానిక పోలీస్ సిబ్బందితో సమన్వయపరుచుకొని సజావుగా జరిగేలా చూడాలన్నారు. పౌరులు ఎవరైనా ఎన్నికలపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 8416235291 హెల్ప్ లైన్ 24/7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో 08416235291, కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మండలాలవారీగా సంబంధిత అధికారులతో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి, నామినేషన్ల ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్లు లోకల్ అధికారులతో సమన్వయపరుచుకొని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జయసుధ, అధికారులున్నారు.