వికారాబాద్/పరిగి టౌన్, డిసెంబర్ 26: ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను అందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం ఆమె వికారాబాద్ పట్టణం శ్రీరామ్నగర్కాలనీలోని రేషన్ షాపును.. పట్టణంలోని పౌరసరఫరాల గోదాములను అదేవిధంగా పరిగి మండలంలోని నస్కల్, సయ్యద్పల్లి గ్రామాల్లోని రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిర్వహించే స్టాక్ రిజిస్టర్, స్టాక్ తెలిపే బోర్డులు, బయోమెట్రిక్ ఈ-పాస్ యం త్రాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ ప్రకారమే ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా ఒక్కొక్క షాపులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే వివరాలను అక్కడి అధికారులు, డీలర్లను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరికీ సకాలంలో రేషన్ బియ్యం అందించాలన్నారు.
పౌరసరఫరాల గోదాములోని తూకం యంత్రాన్ని స్టాక్ వివరాలను క్షు ణ్ణంగా పరిశీలించారు. డీలర్లకు సకాలంలో కమీషన్ డబ్బులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సయ్యద్పల్లి గ్రామంలోని రేషన్ షాపును రైతువేదిక భవనంలో నిర్వహించడంపై ఆమె అధికారులపై మండిపడ్డారు. వెంటనే వేరే స్థలానికి మార్చాలని సూచించారు. అక్కడి షాపు లో స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు లేకపోవడంతో సం బంధిత డీలర్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని క్రీడాప్రాంగణం, హరితహారం నర్సరీని సందర్శించి బాగుందని ప్రశంసించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, వికారాబాద్, పరిగి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవో శేషగిరిశర్మ, పౌరసరఫరాల శాఖ డీటీలు, నస్కల్ సర్పంచ్ పద్మమ్మ పాల్గొన్నారు.