మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మింగా తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీకి సంబంధించిన 32 రకాల రిజిస్టర్లను, నర్సరీ, వైకుంఠధామం నిర్మాణ పనులు, దళితవాడలో మురికి కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు 100రోజుల పని, ప్రతి రోజు ఉదయం 6గంటలకు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకుని పని ప్రాంతంలో వదలాలని ఆదేశించారు.
ప్రతి రోజు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని నర్సరీలో మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. 15రోజుల తర్వాత తిరిగి వస్తానని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వైకుంఠధామం పనులు వేగవంతంగా పూర్తి చేసి, చేసిన పనుల సంబంధించిన డబ్బులు సర్పంచ్లకు సకాలంలో అందే విధంగా ఎప్పటికపుడు ఎఫ్టీవో అప్లోడ్ చేయాలని సూచించారు. గ్రామంలో సారిగా బస్సు సౌకర్యం లేదని, 35మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, వర్షాల వల్ల రోడ్లన్నీ దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలుపగా కలెక్టర్ స్పందించి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించి, రోడ్లు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనంతమ్మ, డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, ఆర్ఐ అరుణ్, టీఏ ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య, గ్రామస్తులు పాల్గొన్నారు.