పరిగి : ఉపాధికల్పన పెంపొందించేందుకు ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, పంటరుణాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న రుణాలను ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నవంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయలన్నారు. ఎస్బీఐ బ్యాంకులో పెండింగ్ కేసులు అధికంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చూడాలని చెప్పారు. సమావేశానికి హాజరుకాని బ్యాంకర్లు తదుపరి సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా వానాకాలంలో జిల్లాలో పంటరుణాల కింద 97,492 ఖాతాలకు రూ. 1,028కోట్లు రుణ లక్ష్యం కాగా 80,513 మంది రైతులకు రూ. 813 కోట్లు రుణాలుగా సెప్టెంబర్ నెలాఖరు వరకు అందించడం జరిగిందని ఎల్డీఎం రాంబాబు తెలిపారు. వ్యవసాయ స్వల్పకాల పరిమితి రుణాల కింద జిల్లాలో రూ. 963కోట్లు మంజూరు చేయడం జరిగిందని, సెల్హెల్ప్ గ్రూపులకు జిల్లాలో 52శాతం, వీధి వ్యాపారులకు 91శాతం రుణులు అందించి రాష్ట్రంలో 6వ స్థానంలో ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రీ ప్లాన్కు సంబంధించిన ప్రొటెన్షియల్ లింకుడ్ క్రెడిట్ ప్లాన్ 2022-23 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ, నాబార్డు డీడీఎం శిరిశర్మ, యాక్సిస్ బ్యాంకు అధికారి బాలసుబ్రహ్మణ్యం, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ సయ్యద్ యూసఫ్, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.