వికారాబాద్ : ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 జనవరి 2022న ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక బృందాలతో ప్రారంభించడం జరిగిందన్నారు. బాలకార్మిక వెట్టి చాకిరీ, బిక్షాట లాంటి వాటిని నిర్మూలించడం, చిన్నారులను రెస్క్యూ చేసుకోవడం వంటివి చేయడం జరుగుతుందన్నారు. వారిని రెస్క్యూ హోమ్కు తరలించడం, చిన్నారులను పనుల్లో పెట్టుకున్నవారిపై తగుచర్యలు తీసుకోవడం ఆపరేషన్ స్మైల్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటి వరకు 3ప్రత్యేక బృందాలు 6మంది చిన్న పిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందన్నారు. వారిని రెస్క్యూ హోమ్కు తరలించినట్లు తెలిపారు. రెస్క్యూ చేసిన పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. తాండూరు సబ్ డివిజన్లో ఒక అమ్మాయికి బాల్య వివాహం చేస్తుండగా తనను సఖీ సెంటర్కు తీసుకెళ్లి రక్షణ కల్పించడం జరిగిందన్నారు.
పరిగిలో ఇద్దరు అమ్మాయిలు బిక్షాటన చేస్తుండగా వారిని పట్టుకొని బాలికల హోమ్కు తరలించామన్నారు. వికారాబాద్ సబ్ డివిజన్లో ఒక బాలుడు పాన్షాప్లో, మరో ఇద్దరు పిల్లలు కూరగాయల మార్కెట్లో పని చేస్తుండగా వారిని పట్టుకున్నామని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. చిన్న పిల్లలతో ఇటువంటి పని చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైన బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100కు చేసి పోలీసు వారికి సమాచారం అందివ్వాలని సూచించారు.