పరిగి : జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 100మంది చొప్పున మొత్తం 400మందికి దళితబంధు పథకం అందేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పథకం అమలు తీరుపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమాలోచనలు చేసి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. లబ్ధిదారులు వచ్చిన డబ్బులతో మూస పద్ధతిలో టాక్సీలు, కిరాణం, బట్టల దుకాణాలు కాకుండా ఉన్నతమైన వ్యాపారాలు చేసుకునే విధంగా సలహాలు అందజేయాలని అన్నారు.
పది మంది కలిసి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందేలా చూడాలని సూచించారు. ఇతర లాభదాయకమైన వ్యాపారాలు చేపట్టే కార్యక్రమాలను అధికారులు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, ఎల్డీఎం రాంబాబు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.