కులకచర్ల : అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా హక్కు పత్రాలను అందించేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాధిక అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు ఆ భూములపై హక్కును కలిగించేందుకు హక్కు పత్రాలను జారి చేయనున్నట్లు తెలిపారు.
గిరిజన రైతుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామాల్లో అటవీశాఖ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను దరఖాస్తు ఫారంలో నింపి అధికారులకు అందజేయాలన్నారు. అటవీశాఖ భూములను సాగుచేస్తూ జీవనం గడుపుతున్న అర్హులైన గిరిజన రైతులకు హక్కు పత్రాలను అందించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్హులైన గిరిజనులు దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తు ఫారాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధారుకార్డు, భూమికి సంబంధించిన ధ్రువపత్రాలు అందించాలన్నారు.
స్వీకరించిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్ధారించి జిల్లా కమిటీకి పంపించనున్నట్లు తెలిపారు. అర్హులైనా గిరిజనులకు హక్కు పత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, తాసిల్దార్ శ్రీనివాస్రావు, ఈవోఆర్డీ సుందర్, అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.