వికారాబాద్ : మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వరదలు ఉధృతంగా పారాయి. వికారాబాద్ పట్టణంలోని మద్గుల్ చిట్టంపల్లికి చెందిన చించల్పేట బందయ్య(55) నవాబుపేట మండలం కేశవపల్లి గ్రామానికి చెందిన మహిళను వివాహాం చేసుకొని అక్కడే ఇల్లరికం ఉండేవాడు. గత కొన్ని రోజుల నుంచి సొంత ఊరు మద్గుల్ చిట్టంపల్లికి వచ్చి పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం సాయంత్రం ఇంటికి రావాల్సిన బందయ్య రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఆరా తీయగా మంగళవారం సాయంత్రం మద్గుల్ చిట్టంపల్లి సమీపంలోని తండా వద్ద వాగులో శవమై కనిపించాడు.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బందయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, కౌన్సిలర్ గోపాల్ ఉన్నారు.