వికారాబాద్ : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతపదన్మాభ స్వామి ఆలయంలో కార్తీక మాసం పెద్ద జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుంచి 29 వరకు స్వామివారికి ప్రత్యేక పూజాలు చేశారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అనంతపద్మనాభ స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసంలో నిర్వహించే పెద్ద జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ అధికారులు పలు సౌకర్యాలు కల్పించారు.
భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా భగీరథ గుండం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక మాసం సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. కోరిన కోరికలు తీరిన భక్తులు కానుకల రూపంలో కోడె దూడలను సైతం ఆలయానికి సమర్పించారు. అదే విధంగా రాత్రి నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రథంపై అనంతపద్మనాభస్వామిని ప్రతిష్టించి ఆలయం నుంచి వాటర్ ట్యాంక్ వరకు భక్తులు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతపద్మనాభ స్వామి రథోత్సవానికి చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు.