Vikarabad | వికారాబాద్, ఏప్రిల్ 30 : వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, పిఎసిఎస్ కంప్యూటరైజేషన్, నూతన పెట్రోల్ పంపులు, ఎల్పిజి, మత్స్య సంఘాలు, డెయిరీ ఫాంలు, గోదాములు, ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా సహకార అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్తో కలిసి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా అదనంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కొత్త పెట్రోల్ పంపులు, ఇప్పటికే ఉన్న పెట్రోల్ పంపుల మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. జన ఔషధి కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకార్ సమితి లిమిటెడ్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగార్జున, నాబార్డ్ డిడిఎం అఖిల్ పున్న, జిల్లా సెంట్రల్ బ్యాంక్ సిఈవో సుబ్రమణ్యం, జిల్లా పశు సంవర్దక అధికారి సదానందం, వ్యవసాయ అధికారి పద్మావతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.