చేవెళ్ల టౌన్, జూలై 9 : రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదుగడం కోసం ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదన్నారు. తెలంగాణ రైతు రాజ్యమని, రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుకు నిదర్శనమన్నారు. రైతులు సంఘటితం కావాలన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరాకు 10వేల చొప్పున ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. రైతులు పంటలను సాగుచేసే ముందు క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో సమావేశమై మాట్లాడుకోవాలని సూచించారు. రైతులు వ్యసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు
రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి రూ.2కోట్ల 70లక్షలతో నిర్మించిన చేవెళ్ల నుంచి మల్కాపూర్ బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రోడ్డు పక్కనే మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మొదటి దశలో రూ.50కోట్లతో 83కిలో మీటర్లు, రెండో దశలో 33 కిలోమీటర్లు రూ.21 కోట్ల పైచిలుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారిశైలజాఆగిరెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శేరిశివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివనీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు నర్సింహులు, మాణిక్యరెడ్డి, సర్పంచ్ మోహన్రెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణచారి, రవీందర్రెడ్డి, ఎంపీడీవో హరిశ్కుమార్, మల్లారెడ్డిగూడ సర్పంచ్ మోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రామురెడ్డి, వార్డు సభ్యులు గంగి యాదయ్య, నాయకులు రమణారెడ్డి, ఆగిరెడ్డి, యాదిరెడ్డి, మాణిక్యరెడ్డి, చింటు పాల్గొన్నారు.
కౌకుంట్ల గ్రామంలో మొక్కలు నాటిన మంత్రి
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డితో కలిసి మొక్కలు నాటి, గ్రామంలో పర్యటించి గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణా, నాయకులు పాల్గొన్నారు.