కులకచర్ల, జూలై 7 : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిని పచ్చనివనంలా మార్చేందుకు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ రాంలాల్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు మణెమ్మ, వెంకటయ్య, నర్సింహులు, పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కులకచర్ల మండలంలో..
కులకచర్ల, జూలై 7 : మండల పరిధిలోని అడవివెంకటాపూర్, విఠలాపూర్, అల్లాపూర్, ఎర్రగోవింద్తండా గ్రామ పంచాయతీలతో పాటు వివిధ గ్రామాల్లో గ్రామస్తులకు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అల్లాపూర్ గ్రామంలో కొత్తగా మట్టి రోడ్డును వేశారు. సర్పంచ్ శివిబాయి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కులకచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో పంచాయతీరాజ్ డీఈ ఉమేశ్కుమార్ శ్మశానవాటిక పనులను పరిశీలించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
పూడూరు, జూలై 7 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్లు కమ్లీబాయి, ఎ.శ్రీధర్గుప్తా, పి.సంతోష, బి.జయమ్మ వేర్వేరుగా పేర్కొన్నారు. పూడూరు మండల పరిధిలో పల్లె ప్రగతిలో భాగంగా తిర్మలాపూర్కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కలుపు మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. పెద్ద ఉమ్మెంతాల్ వీధుల్లో పారిశుధ్య పనులు, కంకల్ గ్రామంలోని ప్రకృతి వనంలో కలుపు మొక్కలు తొలగించారు. అంగడి చిట్టంపల్లి, తదితర గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. హరితహారం ద్వారా ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేశారు.
తాండూరు మండలంలో జోరుగా..
తాండూరు రూరల్, జూలై 7 : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. ఎంపీడీవో సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటారు. మల్కాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మోన్యానాయక్ రోడ్డు వెంట మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కరణ్కోట, గౌతాపూర్, పర్వతాపూర్, చింతామణి పట్టణంతోపాటు పలు గ్రామాల్లో మొక్కలు నాటారు.