నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి సిద్ధం చేయండి
కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశం
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
పాల్గొన్న వికారాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు పౌసుమిబసు, అమయ్కుమార్
వికారాబాద్, జూన్ 5, (నమస్తే తెలంగాణ) : ధరణి పోర్టల్లో భూ సంబంధిత వివిధ కేటగిరిలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, కొత్తగా మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటు, ధరణి పోర్టల్లో గ్రీవెన్స్, పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్లో భూ సంబంధిత గ్రీవెన్స్, వివిధ కేటగిరీల్లో వచ్చిన గ్రీవెన్స్ను పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జూన్ 9లోగా ల్యాండ్ మ్యాటర్స్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్కు సంబంధించిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్లో ఆయా మాడ్యూల్స్లో పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం కనీసం వంద ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని, ఎంత వీలైతే అంత ఎక్కువ స్థలాన్ని గుర్తించి టీఎస్ఐఐసీకి స్వాధీనం చేయాలని సూచించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని, పనులను వేగవంతం చేసి ఈ నెల 17 వరకు అన్ని హంగులతో పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసుకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం ఘనాపూర్ గ్రామంలో 153 ఎకరాలు, నవాబుపేట మండలం అర్కతల గ్రామంలో 174 ఎకరాల అన్ అసైన్డ్ భూమిని గుర్తించామని, ఈ భూమిని స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో ధరణి పోర్టల్లో భూ సంబంధిత ఫిర్యాదులకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులన్ని ఈ నెల 9 వరకు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, డీఎం ఇండ్రస్టీస్ వినయ్కుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అజీజా, ధరణి కో ఆర్డినేటర్ పాల్గొన్నారు.
ధరణి ఫిర్యాదుల పరిష్కారం కోసం బృందం ఏర్పాటు
ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రతిస్పందన వ్యవస్థపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారని కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకుగాను సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్, ఐటీఈఅండ్సీ శాఖలకు సంబంధించిన ఆరుగురు సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధరణి పోర్టల్కు సంబంధించి ఎలాంటి సమస్యలైనా 9133089444కు కాల్ చేయాలని.. అలాగే ascmro@telangana.gov.inకు మెయిల్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు భూములను గుర్తించాం
షాద్నగర్, జూన్ 5 : రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు అనువైన భూములను గుర్తించామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు కొత్తూరు మండలం సద్దాపూర్ గ్రామం, యాచారం మండలం తాలపల్లిగూడ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములను గుర్తించామని తెలిపారు. జిల్లా పరిధిలోని ధరణి పోర్టలో భూ సంబంధిత సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని సీఎస్కు వివరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఈ నెల 9లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతిరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.