తాండూరు, అక్టోబర్ 24: తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడల్లో శమీ, ఆయుధ, వాహన పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హిందూ ఉత్సవ కేంద్ర సమితి, వీరశైవ సమాజం, ఆర్యవైశ్య సంఘంతో పాటు పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తాండూరు పట్టణంలోని బోనమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సామూహిక దసరా (శమీపూజ) కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. పాలపిట్ట దర్శనం అనంతరం నేతలు, పట్టణ ప్రముఖులు కలిసి శమీ వృక్షానికి పూజలు చేసి భారీ రావణాసుర బొమ్మను దహనం చేశారు. సామూహిక దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ శమీని పూజిస్తే శత్రువులు కూడా నాశనమవుతారని పేర్కొన్నారు. హైందవ ధర్మం సనాతనమైనదని, ప్రతీ పండుగకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. పండుగలు ఏవైనా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా జరుపుకోవడం మంచిదన్నారు. పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందించినట్లు వెల్లడించారు. అనంతరం ప్రజలు ఒకరికొకరు జమ్మిని పంచుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజుగౌడ్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ, బీజేపీ జిల్లా కార్యదర్శి ఉప్పరి రమేశ్కుమార్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి కార్యదర్శి పి.నర్సింహులు, పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.