షాద్నగర్, జనవరి 1 : బంతి పువ్వులా ముద్దొచ్చే అందమైన కాక్. దానికి గురిపెట్టి కొట్టేందుకు చేతిలో తేలికైన బ్యాట్. చూడటానికి సరదాగానే ఉంటుంది. కానీ చాంపియన్ లా ఆడడానికి చాలా కష్టపడాలి. కానీ అన్ని వయస్సుల వారు ఆడేందుకు, తమ సత్తాను చాటేందుకు ఆసక్తిచూపుతున్నారు. చాంపియన్లు కాకపోయినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యం పొందుతే చాలు అనే భావనతో క్రీడలపై దృష్టిసారిస్తున్నారు. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన ఇండోర్ బ్యాడ్మింటన్ క్రీడ నేడు అన్ని ప్రాంతాలకు విస్తరించి ఆదరణ పొందుతుంది. కోట్ల రూపాయలను ఖర్చుచేసి క్రీడా ప్రాంగణాలను సైతం నిర్మించుకొని బ్యాడ్మింటన్ క్రీడను ఆడేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇందులో భాగంగానే కొన్నేళ్లుగా షాద్నగర్ పట్టణంలో అన్ని వర్గాల క్రీడాకారులు తమకు అనువైన సమయంలో బ్యాడ్మింటన్ ఆడుతూ తమ ప్రతిభను చూపుతున్నారు. పదుల సంఖ్యలో యువ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులను సాధించి ఆదర్శంగా నిలిచారు. నేడు యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు కసరత్తు చేస్తుంటే, పలువురు పట్టణ వాసులు మెరుగైన ఆరోగ్యం పొందేందుకు ఈ క్రీడలో రాణిస్తున్నారు.
షాద్నగర్లో బ్యాడ్మింటన్
గత కొన్నేండ్ల నుంచే షాద్నగర్ పట్టణంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారు. గతంలో ఏసీపీ కార్యాలయం సమీపంలో ఓపెన్ కోర్టులో పలువురు క్రీడాకారులు, వైద్యులు, అధ్యాపకులు, న్యాయవాదులు, విద్యార్థులు క్రీడలో రాణించేవారు. ఇక్కడి నుంచే జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారు. అనంతరం అన్ని వర్గాల వారు క్రీడపై ఆసక్తి చూపుతూ తమకు అనువైన ప్రాంతాల్లో క్రీడా సాధన చేస్తూ తమ ప్రతిభను చూపుతున్నారు. ఇటీవల కాలంలో నగరాలకు దీటుగా చాంఫియన్ క్రీడాకారులకు పోటీగా బ్యాడ్మింటన్ గురిపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. చాలా కాలంగా యువకులు క్రికెట్, కబడ్డి, వాలీబాల్ క్రీడలపై ఆసక్తి చూపే యువకులు, విద్యార్థులు నేడు అదే రీతిలో బ్యాడ్మింటన్పై దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర క్రీడల శాఖ ఆధ్యర్యంలో పట్టణంలోని మినీ స్టేడియం ఆవరణలో ప్రత్యేకంగా బ్యాడ్మింటన్ ప్రాంగణాన్ని నిర్మించారు. పలు పార్కుల్లో ఓపెన్ మైదానాలు ఉన్నాయి. ఫలితంగా షాద్నగర్లోని యువకులతో పాటు ఉద్యోగులు, కార్మికులు, వైద్యులు, న్యాయవాదులు బ్యాడ్మింటన్పై ఆసక్తిచూపుతున్నారు.
ఆటాడుకుందాం రా..
షాద్నగర్ పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మినీ స్టేడియం పనులను స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పూర్తి చేయించి పట్టణ వాసులకు అందుబాటులోకి తెచ్చారు. బ్యాడ్మింటన్తో పాటు టేబుల్ టెన్నీస్, వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ వంటి క్రీడల మైదానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా బ్యాడ్మింటన్ క్రీడా మైదానాన్ని ఓ పోలీస్ అధికారితో పాటు పలువురు క్రీడాకారులు సొంత నిధులను వెచ్చించి మైదానాన్ని తయారు చేశారు. అంతేకాకుండాగ్రామీణ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా మైదానాలను ఏర్పాటుచేస్తున్నది. దీంతో అటు పట్టణ యువకులు, ఇటు గ్రామీణ యువకులు క్రీడలపై అమితంగా ఆసక్తిచూపుతూ తమ ఇష్టమైన క్రీడా రంగంలో రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాడ్మింటన్ క్రీడపై యువకులు ప్రత్యేక దృష్టిసారించారు. అందుబాటులో ఉన్న మైదానాలను సద్వినియోగం చేసుకుంటూ తమ సత్తాను చాటుతున్నారు. ఫలితంగా షాద్నగర్ ప్రాంత క్రీడాకారులు రానున్న రోజుల్లో బ్యాడ్మింటన్ చాంపియన్లు కానున్నారు.
బ్యాడ్మింటన్లో రాణిస్తున్నారు..
షాద్నగర్ పట్టణంలో అన్ని వర్గాల క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడి యువకులు అథ్లేట్, క్రికెట్, వాలీబాల్, కబడ్డి వంటి క్రీడల్లో చాంపియన్లు ఉన్నారు. వీటితో పాటు బ్యాడ్మింటన్లో కూడా ఇక్కడి క్రీడాకారులు తమ ప్రతిభను చూపుతున్నారు. నాకు కూడా ఈ క్రీడ అంటేనే ఇష్టం. నేను పోటీల్లో పాల్గొనక పోయినప్పటికీ రోజూ బ్యాడ్మింటన్ అడుతాను.
– సాయికుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, షాద్నగర్
గత కొన్నేండ్లుగా ఆడుతున్న..
నాకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే చాలా ఇష్టం. నేను చాంపియన్ కాకపోయినప్పటికీ ఈ గేమ్ అంటే ఇష్టం. సుమారుగా మూడు, నాలుగు యేండ్ల నుంచి ఆడుతున్న. గతంలో ఓపెన్ గ్రౌండ్లో ఆడేవాడిని. ఇప్పుడు ఇండోర్ మైదానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి రోజూ ఇక్కడే ఆడుతున్నాం.
– సంతోష్కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, షాద్నగర్