కేశంపేట, మే 19 : భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా ఎండిపోయింది.
దాదాపు రూ. 80 వేల వరకు అప్పులు చేసి పంటను సాగు చేశానని, పంట ఎండిపోవడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట ఎండిపోవడంతో చేసేది లేక పశువులను మేతకోసం వదిలానని, అధికారులు, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.