గత కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి వ్యవసాయం చేసేవారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లి పంటలకు నీరు పారించేవారు. ప్రతినిత్యం కరెంట్ కోతలతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక.. పనులన్నీ మానేసుకొని పడిగాపులు కాసి పంట సాగు కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రెండు, మూడు గంటల కరెంట్తో పంటలకు నీరు సరిపోక ఎండిపోయి రైతులు నష్టాల పాలయ్యేవారు.
వ్యవసాయం దండుగ అనుకొన్న రైతాంగానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక భరోసాను కల్పించి ఉచితంగా 24 గంటల అందిస్తూ వారికి అండగా నిలిచింది. దీంతో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటూ రైతుల జీవితాల్లో వెలుగులు నిండినట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు.
కాంగ్రెసొస్తే మళ్ల కరెంటు కష్టాలే వస్తయి. కాంగ్రెస్ సర్కారు హయాంలో సగం మడి పారకముందే కరెంటు పొయ్యేది. ఈ కష్టం తీరదా అని ఒకటే దిగులు పడేటోళ్లం. కానీ, బీఆర్ఎస్ సర్కారు వొచ్చినంక ఆ కరెంటు కష్టాలన్నీ తీరిపోయినయి. 24 గంటలు కరెంటు ఇచ్చుడు రైతుల అదృష్టమే. 24 గంటలు కరెంటు ఇస్తున్నోళ్లను కాదని, 3 గంటలు సరిపోతదని చెప్పుడేంది. ఆ మూడు గంటలు దేనికి సరిపోతది.
కాంగ్రెసోళ్లని నమ్మితే మళ్లీ కరెంట్ కష్టాలే… ఏండ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెసోళ్లు రైతులను అస్సలు పట్టించుకోలేదు. వారి పాలనలో అందించిన కరెంట్తో వ్యవసాయం ఆగమైంది. రాత్రుళ్లు పొలాలకు నీళ్లు పెట్టడానికి పోయి ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంట్ కష్టాలు అన్ని తొలగిపోయాయి. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న 3 గంటల కరెంట్తో పది గుంటల పొలం కూడా తడవదు. 10 హెచ్పీ మోటర్తో రైతులపై ఆర్థిక భారం పడుతుంది.
వెనుకటికి కరెంటు లేక పంటలు సాగుచేసుకుంటందుకు మస్తు ఇబ్బంది అయ్యేది. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తదో… ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి నెలకొనేది. కాని, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నడు. రైతుల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా రేవంత్రెడ్డి 3గంటల కరెంటు సరిపోతుందని చెప్పటం మంచిది కాదు.
– లక్ష్మమ్మ మహిళారైతు, ఇబ్రహీంపట్నం
కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న 3గంటల కరెంట్తో ఎకరం భూమిని కూడా సాగు చేయలేము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల ఇవ్వడం ద్వారా రైతులకు కష్టాలు తీరాయి. ఇప్పుడిప్పుడే రైతులు సంతోషంగా ఉంటున్నారు. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుంది. 10 హెచ్పీ మోటర్లు వాడే పరిస్థితి రైతులకు లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తుంది. రైతులు అందరూ బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. 24 గంటల కరెంట్తోనే రైతులకు లాభం.
– వెంకటేశ్, రైతు,తుర్కయాంజాల్ మున్సిపాలిటీ)
మూడు గంటల కరెంట్తో అసలు వ్యవసాయమే సాగవ్వదు. రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. విత్తనాలు, మందుబస్తాల కోసం ఇబ్బందులు పడేది. పంట పెట్టుబడిలేని అప్పులు చేసేవాళ్లం. కరెంట్ కోతలతో రైతుకు పెట్టుబడి రాక నానా అవస్థలు పడ్డాం. రైతు బిడ్డ సీఎం కేసీఆర్ వ్యవసాయం బాగుండాలంటే ఏం చేయాలని ఆయనకు బాగా తెలుసు. ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలువాలని చూస్తున్న కాంగ్రెస్ను రైతులు నమ్మరు.
– నాగరత్నం నాయుడు, రైతు సద్దుపల్లి, అబ్దుల్లాపూర్మెట్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ బదులు కేవలం మూడు గంటలే ఇస్తామని చెప్పటం సరైంది కాదు. 3 గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయం బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కరెంట్తో ఒక్క మడైనా పారుతుందా. గత పాలకుల పాలనలో కరెంట్ కష్టాలతో మా వాళ్లు ఆగమయ్యారు. కొంత మంది వ్యవసాయాన్ని విడిచిపెట్టారు. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంట్తో గుంట భూమి మిగలకుండా పంటలు పండిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగింది. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే సాగు విస్తీర్ణం తగ్గుతుంది.
– అల్లాజీ, రైతు, జంగారెడ్డిపల్లి, ఆమనగల్లు
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్, సాగు నీరు అందిస్తూ సాగును పండుగలా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం సరికాదు. ప్రశాంతంగా ఉన్న రైతుల బతుకులు ఆగం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నరు. అలా జరిగితే రైతన్నకు మళ్లీ పాతరోజులే వచ్చి సకాలంలో కరెంట్ సరఫరాలేక పంటలు ఎండిపోయి కష్టాలే మిగులుతాయి.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మూడోసారి రావాలి.
-ఎదిరె మాణిక్యం, రైతు, దేవునిఎర్రవల్లి (చేవెళ్ల)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇచ్చే మూడు, నాలుగు గంటల కరెంట్ కూడా రాత్రిపూట, పగటి పూట రెండు విడుతల్లో ఇచ్చేవారు. పంటలకు నీరుపెట్టేందుకు రాత్రిపూట పొలాల కాడికి పోయి అవస్థలు పడేవాళ్లం. కానీ రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల నిరంతర కరెంట్ అందిస్తుండడంతో ఆ బాధలు పోయినయ్.
– సునుగంటి పాపిరెడ్డి, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
గత కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. మూడు గంటల కరెంట్తో వ్యవసాయం చేయలేం. రైతు బిడ్డ, సాగు కష్టాలు తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉండటం తెలంగాణ రైతుల అదృష్టం. 10 హెచ్పీ మోటర్లను పెట్టుకుని మూడు గంటల కరెంటుతో పంటలను పండించలేం. అందరూ ఒకేసారి మోటర్లు వేస్తే ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎక్కువ పడి కాలిపోతాయి. కాంగ్రెస్ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నది. వారికి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పాలి.
– కుంచము శివకుమార్, చేవెళ్ల