పరిగి, మార్చి 27 : ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస సదుపాయాల కల్పనతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో ఆరున్నర దశాబ్దాల్లో చేపట్టని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసి చూపించింది. ఇందుకుగాను అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసింది. పల్లెల నుంచి పట్టణం వరకు అన్నింటిలో అభివృద్ధే లక్ష్యంగా నిధులు వెచ్చించడంతో పరిగి నియోజకవర్గంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. విద్యాభివృద్ధితోపాటు వైద్యరంగం, ఇతర రంగాల్లో మరింత అభివృద్ధి సాధించే దిశగా పరిగి నియోజకవర్గంలో పనులు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంత విద్యార్థుల కలగా నిలిచిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిగిలో ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురుకులాల ఏర్పాటుతో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారి పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చక్కటి విద్య అందుతున్నది. పరిగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రూ.5కోట్లతో నూతన భవనం నిర్మాణం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై ఒక రహదారి నిర్మాణం పూర్తవగా మరొకటి చేపడుతున్నారు. ఇవేకాకుండా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపాయంలో భాగంగా పెద్ద ఎత్తు నిధులు వెచ్చించి డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేయబడిన నీటిని సర్కారు అందిస్తున్నది. పేదలకు ఇచ్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. పరిగి పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో రూ.15కోట్లు మంజూరు చేయగా పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం సైతం రూ.2కోట్లు మంజూరు చేయబడ్డాయి. ఇవేకాకుండా మిషన్ కాకతీయ కింద ప్రతి చెరువు, కుంటను పునరుద్ధరించడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందుతున్నది. పరిగి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రభుత్వం పేదలకు ఆసరాగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా దివ్యాంగులకు నెలకు రూ.3016, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేతన్నలు, గీత కార్మికులు, ఇతరులకు నెలకు రూ.2016 చొప్పున పింఛన్ అందజేస్తుంది. నియోజకవర్గంలోని దోమ మండలంలో 6248 మందికి నెలకు 1,47,61,160 రూపాయలు, కులకచర్లలో 6335 మందికి రూ.1,55,91,824, పరిగి మండలంలో 5457 మందికి రూ.1,30,86,528, పరిగి మున్సిపాలిటీలో 1444 మందికి రూ.33,67,232, పూడూరు మండలంలో 6002 మందికి రూ.1,42,57,960, గండీడ్ మండలంలో 7079 మందికి రూ.1,72,52,984 ప్రతినెలా పింఛన్లను అందజేస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేసి పరిగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(50 పడకలు) భవనాన్ని నూతనంగా నిర్మాణం చేపట్టింది. దీంతోపాటు దవాఖానలో అవసరమైన వైద్య యంత్ర పరికరాలు సైతం సమకూర్చింది. పరిగి మున్సిపల్ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి బస్తీ దవాఖాన సైతం మంజూరు చేసింది. పరిగి దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలోని డయాలసిస్ రోగులకు పరిగి దవాఖానలోనే డయాలసిస్ సేవలు అందనున్నాయి.
పేదలకు అందజేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. పరిగి నియోజకవర్గానికి 680 డబ్లు బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. పరిగి పట్టణంలోని తుంకులగడ్డలో 300 ఇండ్లు, పూడూరు మండలానికి 50, దోమ మండలానికి 50, కులకచర్ల మండలానికి 80, గండీడ్ మండలానికి 100, మహ్మదాబాద్ మండలానికి 100 ఇండ్లు మంజూరు చేసింది. వాటిలో చాలావరకు ఇండ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పరిగి మున్సిపాలిటీ పరిధిలో రూ.18.70కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి చొరవతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా రూ.15కోట్లు మంజూరు చేయించారు. వాటితోపాటు మున్సిపల్కు చెందిన నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని గంజ్రోడ్డు వెడల్పు పనులు చేపట్టగా డివైడర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నది. టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు వెడల్పుతోపాటు డివైడర్ ఏర్పాటు చేశారు. పాత పరిగి నుంచి తుంకులగడ్డకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. వాటితోపాటు పలు కాలనీల్లో సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.2కోట్లతో వైకుంఠధామం పనులు చేపడుతుండగా డంపింగ్యార్డుతోపాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉన్నది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో పరిగి నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు సదుపాయం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం రాఘవాపూర్ నుంచి కులకచర్ల, సుల్తాన్పూర్ నుంచి దోమ మీదుగా బాస్పల్లి వరకు రూ.49కోట్లు, కులకచర్ల నుంచి నంచర్ల వరకు రూ.18కోట్లు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. కులకచర్ల నుంచి నల్లరాళ్లగుట్ట, కులకచర్ల నుంచి దాదాపూర్, ఇప్పాయిపల్లి నుంచి పుట్టాపహాడ్, మోత్కూర్ స్టేజీ నుంచి ఐనాపూర్ వరకు రూ.22కోట్లతో రోడ్ల నిర్మాణం జరిగింది. పూడూరు మండలం అంగడిచిట్టెంపల్లి నుంచి లాల్పహాడ్ వరకు రూ.3కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇవేకాకుండా పరిగి-షాద్నగర్ రోడ్డు జిల్లా సరిహద్దు వరకు మరమ్మతు, రీ బీటీ కోసం రూ.5.80కోట్లు మంజూరవగా పనులు కొనసాగుతున్నాయి. పరిగి నుంచి వికారాబాద్ వయా నస్కల్ రోడ్డును రూ.8కోట్లతో చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో రెండు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. పూడూరు మండలం మన్నెగూడ నుంచి కర్ణాటకలోని మరో జాతీయ రహదారి వరకు 90 కిలోమీటర్ల జాతీయ రహదారిని రూ.320కోట్లతో చేపట్టగా పరిగి నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.150కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. మరోవైపు మహబూబ్నగర్-చించోలి జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరవగా పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్, గండీడ్ మండలాల పరిధిలో సుమారు రూ.100కోట్లతో రోడ్డు పనులు జరుగనున్నాయి.
ప్రభుత్వం రైతును రాజుగా చేయడం కోసం పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. మొదట ఎకరాకు రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8వేలు అందించగా 2019 సంవత్సరం నుంచి రూ.10వేలకు పెంచడం జరిగింది. పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, గండీడ్, చౌడాపూర్, మహ్మదాబాద్ మండలాల్లో 2018 నుంచి గత యాసంగి సీజన్ వరకు రైతులకు రైతుబంధు కింద రూ.700కోట్లు పెట్టుబడి సహాయంగా అందించడం జరిగింది. తద్వారా అప్పులు లేకుండానే రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసుకునేందుకు సర్కారు తోడ్పాటు అందించింది.
ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మరింత నాణ్యమైన కరెంటు సరఫరాకు నిర్ణయించింది. ఇందులో భాగంగా పరిగి మండల పరిధిలో విండ్ పవర్ ఉత్పత్తికి అనుమతించగా సుమారు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ఓ సంస్థ విండ్ పవర్ టర్బైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. రూ.600కోట్లు అంచనా వ్యయంతో 48 విండ్ పవర్ టర్బైన్స్ ఏర్పాటు చేసి పవన విద్యుత్ను ట్రాన్స్కోకు అందజేస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ పరిగి ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరిపోయే స్థాయిలో ఉంటుందని, అత్యధికంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పవన విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నది. పరిగి మండలం జాఫర్పల్లి సమీపంలో రూ.50కోట్లు వెచ్చించి 135 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 19 మండలాలకు శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతున్నది. పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లోని గ్రామాల్లో సుమారు రూ.150కోట్లు ఖర్చు చేసి పైప్లైన్, తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రతిరోజూ 7 మండలాల్లోని ప్రజలకు 39 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన తాగునీరు సరఫరా అవుతున్నది.
పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టును మినీ ట్యాంక్బండ్గా మార్చడానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మినీ ట్యాంక్బండ్ నిర్మాణానికి రూ.6.83 కోట్లు మంజూరవగా, ఇప్పటివరకు రూ.5.56 ఖర్చు చేసి కట్ట వెడల్పు పెంచడంతోపాటు, బతుకమ్మ ఘాట్, గణేశ్ఘాట్, రెయిలింగ్, వాకింగ్ ట్రాక్ల నిర్మాణం చేపట్టారు. మిగతా పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని రాకంచర్లలో 150 ఎకరాలల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయగా టీఎస్ఐఐసీ వారు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించారు. పారిశ్రామిక వాడలో 42 ప్లాట్లు చేయగా వాటిలో కొన్నింటిని కేటాయించారు. కేటాయింపులు జరిగిన స్థలాల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల 30 స్టీల్ ఫ్యాక్టరీలను రాకంచర్ల పారిశ్రామిక వాడలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటన్నింటినీ తరలిస్తే ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
పరిగి నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా, అదనంగా మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, గండీడ్ మండలాలు ఉండేవి. కులకచర్ల మండలంలోని గ్రామాలతో చౌడాపూర్, గండీడ్ మండలంలోని గ్రామాలతో మహ్మదాబాద్ కొత్త మండలాలు ఏర్పాటుచేయడం జరిగింది. తద్వారా ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి పేద వారికి ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. రెండు దశాబ్దాల కలగా మిగిలిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిగిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో పరిగి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వగా, హామీ నెరవేర్చడం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతోపాటు పరిగిలో మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాలు, గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల, మైనారిటీ గురుకులం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మైనార్టీ గురుకులం పూడూరు మండలం మన్నెగూడలో కొనసాగుతున్నది. నాలుగు గురుకులాల్లో 1585 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 25వేల వరకు ఖర్చు చేస్తున్నది. పరిగిలోని తుంకులగడ్డలో రూ.4కోట్ల వ్యయంతో గిరిజన గురుకులం కళాశాల, పాఠశాల నిర్మాణం చేపట్టారు.
ప్రభుత్వం ఓవైపు సర్కారు దవాఖానలను పటిష్టం చేసి పేదలకు ఉచిత వైద్యాన్ని మరింత నాణ్యతగా అందిస్తూనే కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నది. నాలుగేండ్లలో నియోజకవర్గ పరిధిలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండీడ్, మహ్మదాబాద్ మండలాల పరిధిలోని వారికి రూ.25.67కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి డబ్బులు మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేశారు. అలాగే కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సకు ముందుగానే రూ.6.56కోట్లు ఎల్వోసీలు సైతం అందించడం జరిగింది.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిగిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టింది. రూ.కోటి నిధులతో
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తైంది.