ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 4 : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్రోడ్డులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు. మృతిచెందిన ముగ్గురు విద్యార్థులు భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు రాయపోల్ నుంచి బైక్పై ఇబ్రహీంపట్నంవైపు వస్తుండగా.. ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరిని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగల్పల్లి వద్దగల భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కే నవీన్, ఎస్ నారాయణరెడ్డి, భానుప్రసాద్ మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నంవైపు వస్తున్నారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్కు వెళ్తున్న కారు (ఏపీ28బీఎస్0010) అతివేగంగా ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన విద్యార్థులు నగరంలోని లంగర్హౌజ్, వనస్థలిపురం, రంగారెడ్డిజిల్లా కందుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ఆస్పత్రి ఆవరణలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
రాయపోల్-ఇబ్రహీంపట్నం వద్ద సింగిల్ రోడ్డు ఉన్నప్పటికీ వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ.. తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. కారు అతి వేగంగా రావడంతోనే ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. రాయపోల్ గ్రామానికి చెందిన శివ (కారు డ్రైవర్) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.