మొయినాబాద్, జనవరి 12 : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించడానికి గురుకుల విద్యా సంస్థ ప్రోత్సహిస్తున్నది. సంస్థ అందించే అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అభ్యసించడంతోపాటు వివిధ ఈవెంట్లలో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చుతున్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉమాదేవి జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైంది.
ఈ నెల 10, 11 తేదీల్లో నిర్మల్ జిల్లా కొండాపూర్లోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పర్యావరణ ఇన్స్పైర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి 256 నమూనాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. అందులో 26 నమూనాలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 26 నమూనాల్లో చేవెళ్ల గురుకుల పాఠశాలకు చెందిన నమూనా కూడా జాతీయస్థాయికి చేరింది. పాఠశాలకు చెందిన విద్యార్థిని ఉమాదేవి ప్లాస్టిక్ ఈటింగ్ ఎడిబుల్ మశ్రూమ్ అనే ప్రాజెక్టును తయారుచేసి ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ నెల 26న గతణంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో ఈ ప్రాజెక్టును ప్రదర్శించనున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని జోడించి అనేక రకాల ప్రాజెక్టులను తయారుచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎంపికైన ఏకైక పాఠశాల చేవెళ్ల పాఠశాల అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.