షాబాద్, ఏప్రిల్ 9: చేవెళ్ల నియోజకవర్గంలో ఉగాది పండుగను ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లోని హనుమాన్ దేవాలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ప్రజలు కొత్త బట్టలు ధరించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజల రాశిఫలాలను వేదపండితులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : తెలుగు నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం (ఉగాది) పండుగను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఇండ్లల్లో పచ్చడి ఏర్పాటు చేయటంతో పాటు తెలుగు ప్రజలు ఎంతో ప్రేమగా చేసుకునే నేతిబొబ్బట్లను చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ప్రధాన ఆలయాల్లో పూజారులు పంచాంగం చదివి ప్రజలకు వివరించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో ఉగాది పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధ్దలతో ఉగాది పండుగను చేసుకున్నారు. పండుగ సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో ఐద్వా మండల అధ్యక్షురాలు మున్నీ ఆధ్వర్యంలో గ్రామప్రజలకు ఉగాది పచ్చడిని తయారు చేసి అందించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పలువురు ప్రజాప్రనిధులు, పలు పార్టీల నేతలు ఆకాంక్షించారు.
షాద్నగర్టౌన్ : హిందూ సాంప్రదాయాల్లో ప్రముఖ పర్వదినమైన తెలుగు ప్రారంభ సంవత్సర ఉగాదిని ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ శోభకృత్ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. తెల్లవారుజాము నుంచే తమ నివాసాలను పరిశుభ్రం చేసుకుని మామిడి, వేప కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లో ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఇంటిని శుభ్రం చేసి గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు, వేప ఆకులతో అలంకరించారు. పండితులతో పంచాంగం చదివించారు.
కడ్తాల్ : ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గ్రామ ప్రధాన పురోహితుడు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉగాది పచ్చడిని అందజేశారు. మైసిగండి మైసమ్మతల్లి ఆలయంలో అమ్మ వారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.