ధారూరు, నవంబర్ 3 : రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మధునంతాపూర్కు చెందిన నానావత్ కిషన్(40), వర్త్యా రవి(40), హేమ్లా(45)., రేగొండి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ జలీల్(35) దుర్మరణంపాలయ్యారు.
గాయపడినవారిలో లిల్లిగడ్డాతండాకు చెందిన ముడావత్ సుమిత్రాబాయి, రేగొండి గ్రామానికి చెందిన దండేగళ్ల రమేశ్, మధునంతాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ చందర్, రాథోడ్ కిషన్, వర్త్యా సోనీబాయి, ధారూరు మండలం బాచారం గ్రామానికి చెందిన బేగరి శ్రీనివాస్ ఉన్నారు. మధునంతాపూర్కు చెందిన ముగ్గురు మృతిచెందడంతో వీరి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. గాయపడిన నేనావత్ వినోద్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.రోజూ కూలీకి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి వీరిది. దీంతో వీరి కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి సబితారెడ్డి
రోడ్డు ప్రమాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. సంఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు ప్రాణాలు కోల్పవడం, పలువురు గాయాలపాలు కావడం బాధాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
పరామర్శ
హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కోటిరెడ్డి
రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానకు వెళ్లి రోడ్డు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్థిక సాయం అందజేత
పెద్దేముల్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మృతులు కిషన్, హేమ్లా, రవి, జలీల్ కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయాన్ని శుభప్రద్పటేల్ అందజేశారు. వీరి వెంట పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మధునంతాపూర్, రేగొండి సర్పంచ్లు గోవర్ధన్, హైదర్ ఉన్నారు.