షాబాద్, ఏప్రిల్ 25 : గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 12,051మందికి కంటి పరీక్షలు చేయగా, జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు చేశారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 12,051మందికి..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 12,051మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 632 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 570 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు.
360 గ్రామాలు, 72 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు కండ్లద్దాలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో 5378 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 606 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 791 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇప్పటి వరకు 360 గ్రామాలు, 72 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
అద్దాలు ఇచ్చిండ్రు..
కంటి చూపు సమస్యలు ఉన్న పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా సొంత గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఉచితంగా ఇవ్వడం సంతోషకరం. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన సీఎం కేసీఆర్ మంచి పాలనాదక్షతకు నిదర్శనం. నేను పరీక్షలు చేయించుకొని మందులు, అద్దాలు తీసుకున్నా.
– ప్రభుగౌడ్, ఊరెళ్ల గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా