మహేశ్వరం, నవంబర్ 6: గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని గిరిజన, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవాన్ని కల్పించడంతోపాటు పోడు భూముల పట్టాలను అందజేసి వారి గోస తీర్చారన్నారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న సబితారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో స్వయం పాలనను అందించిన గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గిరిజన తండాల్లో రోడ్లు, మంచి నీటి వసతులను కల్పించడంతోపాటు పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామన్నారు. తనను మరోసారి గెలిపించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆమె కోరారు.