మియాపూర్ , డిసెంబర్ 28 : తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్యాసకులైన ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం తరఫున శిక్షణ ధ్రువ పత్రాలతో పాటు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికీ రూ. 9వేల చొప్పున ఉపకారవేతనాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమాజంలో బతుకుదెరువు కోసం ట్రాన్స్జెండర్లు నానా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి స్వయం ఉపాధికి ప్రభుత్వం పటిష్ట చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు ట్రాన్స్ ఉమెన్స్ సొసైటీ తోడ్పాటుతో ఆల్విన్ కాలనీ డివిజన్లో ఉన్న దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా జ్యూట్ బ్యాగుల తయారీలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించింది. పలు ప్రభుత్వ విభాగాల నుంచి వివిధ సైజుల జ్యూట్ బ్యాగులపై ఆర్డర్లు సంపాదించిన కేంద్రం అధికారులు.. శిక్షణ పొందుతున్న ట్రాన్స్జెండర్లతో వాటిని తయారు చేయించారు. అవి మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి.