సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించే క్రమంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలనే నేటి నుంచి మరింత కచ్చితంగా అమలు చేయడంతో పాటు నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో రోప్(రిమూవబుల్ అబస్ట్రాక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్)ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.
నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తించేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దించనున్నట్లు డీసీపీ తెలిపారు. అక్టోబర్ 8 నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ను కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి ఫ్రీ-లెఫ్ట్ను బ్లాక్ చేసిన వాహనదారులకు వెయ్యి రూపాయల జరిమానా, రెడ్ సిగ్నల్ పడిన తరువాత స్టాప్లైన్ దాటిన వారికి రూ.100, నో-పార్కింగ్, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే విధంగా రోడ్లను ఆక్రమించుకునే వారికి సైతం చట్టరీత్యా జరిమానాలు, అవసరమైతే కేసులు కూడా నమోదు చేయడానికి వెనుకాడబోమని డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.