న్యూస్ నెట్వర్క్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) ;హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. రసాయనిక రంగుల వాడకంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా రంగులు కండ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులనే వాడాలని సూచిస్తున్నారు. ఎక్కువ రసాయనాలు కలిగిన రంగులతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. కండ్లల్లో రంగు పడితే వెంటనే నీటితో శుభ్రంగా కడుక్కోవాలని, కండ్లు మండినా, ఎర్రగా మారినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఆలస్యం చేస్తే కొన్నిసార్లు కంటి చూపునే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం మొత్తం కప్పబడేలా దుస్తులు, తలపై క్యాప్ ధరించాలని సూచిస్తున్నారు.
వసంత రుతువు ఆగమానానికి చిహ్నం హోలీ పండుగ. చెట్ల ఆకులు రాలి కొత్త ఆకులు చిగురిస్తాయి. ప్రజల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపే పండుగ ఇది. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిర్వహించుకునే పండుగ. పండుగకు ముందురోజు గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద కట్టెలు, పిడకలతో కామ దహనం చేస్తారు. పల్లెల్లో వారం రోజులపాటు ఆటపాటలతో సంబురాలు చేసుకుంటారు. ఒకేసారి దోస్తులమంతా కలిశామన్న ఉత్సాహం.. కాలనీలో చుట్టు పక్కలవాళ్లందరం ఒకచోటకు చేరామన్న సంతోషం.. గులాల్, పసుపు పచ్చని రంగు, నీళ్లలో కలిపి చల్లే రాణీ కలర్ ఇలా అందరి చేతుల్లోనూ భిన్నమైన రంగులే. ఈ సమయంలో కొత్త వాళ్లు వస్తే రంగులతో పొల్లు పొల్లు చేయాలని ఉత్సాహం కనబరుస్తారు. ‘అందరం ఒకేసారి రంగులు చల్లాలి. ముద్ద ముద్ద చేయాలి’ అంటూ కొందరు, దూరం నుంచే వాటర్ బెలూన్లతో కొట్టి సర్ప్రైజ్ చేయాలని ఇంకొందరు. కానీ, ఉత్సాహం వేళ సంతోషాల మాటున అంధకారం నింపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా విషాదం నింపే ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పండుగ వేళ ప్రధానంగా కండ్లు, చెవులు ఆపై చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.
హిందువులు నిర్వహించుకునే పండుగలన్నిటికంటే ఆనందంగా సంబురాలు చేసుకునే పండుగ హోలీ. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు చల్లుకుంటారు. వసంత రుతువు ఆగమనం సందర్భంగా చెట్ల ఆకులు రాలి కొత్త చిగురులు వేస్తాయి. విరబూసిన మోదుగు చెట్లు ఆకట్టుకుంటాయి. హోలీకి ముందు రోజు పల్లెల్లోని ప్రధాన వీధుల్లో కామదహనం చేస్తారు.
కనిపించని బత్తీస దండలు..
హోలీ పండుగ పూర్తి అయిన తరువాత సాయంత్రం పెద్దలు తమ పిల్లలకు బత్తీస (మిఠాయి పేరు) దండలు వేస్తారు. ప్రస్తుతం సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న వాతావరణం మాత్రం పల్లెల్లో కనుమరుగైంది. హోలీ పండుగ రోజున పిల్లలకు వేసిన బత్తీస దండలను దాచి పెట్టి ఉగాది రోజున చిన్న పిల్లలకు వేస్తారు. అదే రోజు స్వీటుగా భావించి చిన్న పిల్లలు తినేవాళ్లు. కాని అలాంటి సంప్రదాయం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైంది. హోలీ పండుగ రోజు మధ్యాహ్నం తరువాత మహిళలు ఇంటింటికీ తిరిగి హోలీ పాటలు పాడుతూ ఇనాం అడుక్కునే వాళ్లు కాని అక్కడక్కడ ఇలాంటి ఆటాపాటలు కనిపిస్తున్నాయి. నగర శివారు గ్రామాలోలమాత్రం కనిపించడం లేదు.
విద్యాలయాల్లో హోలీ వేడుకలు…
రంగుల పండుగ హోలీ వేడుకలను సోమవారం తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కేరింతలతో ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. ఉపాధ్యాయులు కూడ రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తం చేశారు. పెద్దేముల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు సహజసిద్ధమైన మోదుగ పువ్వుతో రంగును తయారు చేశారు.
రసాయన రంగులతో చర్మ వ్యాధులు..
రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కండ్ల మంటలు, ఆస్తమా, చర్మ వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ ఉంటుందని, ఇది మూత్రపిండాలను పాడు చేస్తుందని, వెండి రంగులో ఉండే మెర్క్యురీ సల్ఫేట్తో క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాపర్ సల్ఫేట్ ద్వారా ఎలర్జీతో పాటు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉన్నది. పొడిగా ఉండే రంగుల్లో జిలెటిన్పైలట్ కలవడం వల్ల మైకంతో పాటు ఆస్తమా, అంధత్వం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
పిల్లలు మరింత జాగ్రత్త
హోలీ పండుగ సమయంలో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన రంగులను వినియోగించొద్దు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది. కండ్లు, చెవుల్లో రసాయన రంగులు కలిపిన నీళ్లు నేరుగా పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడితే వెంటనే తాగునీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత కూడా కండ్లు మండినా, ఎర్రగా మారినా వెంటనే దగ్గరలోని కంటి వైద్యులను సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే కొన్నిసార్లు కంటి చూపునే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది చిన్నారుల్లో అధికంగా ఉంటుంది. చిన్న పిల్లలను ఒంటరిగా హోలీ ఆడుకోనివ్వద్దు. తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుండాలి. ప్రమాదం జరిగాక చికిత్స కంటే.. ప్రమాదం జరగకుండా చూసుకోవడమే ఉత్తమం.
– కౌముది, కంటి వైద్యురాలు
జాగ్రత్తలు తప్పనిసరి