జయం కోసం జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమనగల్లులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. మంత్రి సమక్షంలో వివిధ పార్టీల నుంచి వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్లో చేరనున్నారు. 50వేల మందికిపైగా సభకు తరలించేలా బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తమవుతున్నారు. మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు షాద్నగర్ పట్టణంలోనూ మంత్రి కేటీఆర్ రోడ్ షో ఉన్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు.
– రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్నారు. తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆమనగల్లుకు వస్తున్నారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి విఠాయిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ బీఎన్ఆర్ ఫంక్షన్హాల్లో నిర్వహించే కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి వెయ్యి మంది మంత్రి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అక్కడి నుంచి మంత్రి ఆమనగల్లుకు బయలుదేరి 3.30 గంటలకు ఆమనగల్లులో మాడ్గుల రోడ్డులోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 50వేల మందితో భారీగా బహిరంగ సభను నిర్వహించేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ నియోజకవర్గవ్యాప్తంగా ఒక దశ ప్రచారం పూర్తి చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇప్పటికే ఒక దఫా ఈ ప్రాంతంలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఆదివారం మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్లుకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, వెల్దండ, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం రానుండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే మార్గంలో అవుట్స్కర్ట్స్లలో వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వెయ్యిమంది బీఆర్ఎస్ వలంటీర్లు సైతం సభా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.
కేటీఆర్ పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ శనివారం పరిశీలించారు. సభా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, బీఆర్ఎస్ పట్టణ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్, పెద్ద శ్రీను, వెంకటయ్య, ఏఎంసీ డైరెక్టర్లు సుభాష్, రమేశ్, సాయిలు, ప్రసాద్, విక్రమ్, జహంగీర్ ఉన్నారు.