ఇబ్రహీంపట్నం, జనవరి 24 : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 31,08,755 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. 18 ఏండ్ల పైబడిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రంగారెడ్డిజిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న ఎక్కువమంది ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో రంగారెడ్జిజిల్లాలో ఓటర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
నేడు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని మండలాల్లో బుధవారం తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి మండలంలో ర్యాలీలు నిర్వహించడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించి ఓటు హక్కు విలువలను తెలియజేయనున్నారు. ఇందుకోసం అన్ని మండలాల్లో తహసీల్దార్లు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించనున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది : వెంకటాచారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏండ్లు పైబడినవారు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కు. దానిని అందరూ వినియోగించుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తాం.
ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి
ఓటు హక్కు ప్రతి పౌరుడి సామాన్య హక్కు. ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ప్రస్తుత సమాజంలో ఓటు హక్కును దుర్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉన్నందున ప్రజలు మద్యం, డబ్బులకు అమ్ముడుపోకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలు పరిష్కరించే పౌరులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.