రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు కౌంటింగ్ ప్ర క్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులుండగా.. వారి భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్నది.
ఏ డు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్న చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫలితాలు వెల్లడి కానున్న జూన్ 4 వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది.
చేవెళ్ల లోక్సభ పార్లమెంట్ పరిధిలోని చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 13న పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లను డిస్ట్రిబ్యూటరీ సెం టర్లకు.. అక్కడి నుంచి చేవెళ్లలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూంలకు చేర్చి అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూం లకు సీల్ వేశారు. అక్కడ సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. క్లోజ్డ్ సర్క్యూట్ సీసీ కెమెరాల నిరంతర నిఘా కొనసాగుతున్నది. ఒక్కో స్ట్రాంగ్రూంను వెబ్ కాస్టింగ్ స్క్రీనింగ్ ద్వారా కలెక్టర్ శశాంకతోపాటు ఇతర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులె వరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతోపాటు కొంతమంది అధికారులను పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించారు.
కౌంటింగ్ రోజున ఎటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ నిర్వహించనున్న బండారి శ్రీనివాస్ కళాశాలలో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, తాగునీటి వసతితోపాటు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది రాకపో కలు.. అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకలకు బారికేడ్లతో వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫలి తాల వెల్లడి తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.