బడంగ్పేట, ఆగస్టు 13 : గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్కు చేరికలతో మరింత బలం.. బలగం పెరుగుతున్నది. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన 80 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 300ల మందికి పైగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వివిధ పార్టీలకు చెందినవారు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన బీజేపీ శ్రేణులు 80 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పాటుపడే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉందామన్నారు. అనంతరం పార్టీలో చేరినవారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య, వార్డు అధ్యక్షుడు సైదులు, యూత్ సభ్యులు శివ, షరీఫ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలన చూసి బీఆర్ఎస్లోకి చేరికలు
కొడంగల్ : ప్రజా సంక్షేమం దిశగా కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల శ్రేణులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి, అభివృద్ధికి మేము సైతం అంటున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో హైదరాబాద్లో నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు దాదాపు 300లకు పైగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన 9 సంవత్సరాల్లోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టారన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగుతున్నదని.. దీంతో అందరి చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల జాతర కావడంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిపిస్తే ఎన్నో పథకాలు అమలు చేస్తామని హామీలు కురిపిస్తున్నారని, ప్రజలను మోసం చేసేందుకే ఇటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. సీఎం కేసీఆర్ కృషితో చరిత్రలో నిలిచే సంక్షేమ పథకాలతో పాటు ప్రపంచాన్ని అబ్బురపరిచే ప్రాజక్టులు, మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ వంటి ఎన్నో అద్భుత పథకాలతోపాటు అద్భుత కట్టడాలు సాధ్యపడుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, దండుగన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా నిలిచి హ్యాట్రిక్ సాధనతో పాటు ప్రపంచపటంలో ఆదర్శ తెలంగాణగా నిలబెట్టుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.