రంగారెడ్డి, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఆయా మేజర్ గ్రామపంచాయతీల పూర్తి వివరాలను క్రోడీకరించి మున్సిపాలిటీలుగా మార్చడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను పంపించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు తోడుగా మరో 3 మున్సిపాలిటీలు రానుండడంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 16కు చేరనున్నది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరంతోపాటు చేవెళ్లనూ మున్సిపాలిటీలుగా మార్చితే ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావించింది. అలాగే, చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల హెడ్క్వార్టర్లు కూడా మున్సిపాలిటీలుగా మారనున్నాయి.
చేవెళ్ల మున్సిపాలిటీలోకి వచ్చే గ్రామాలు..
చేవెళ్ల గ్రామపంచాయతీ పరిసరాల్లో ఉన్న కందవాడ, పలుగుపట్ల, మల్లారెడ్డిగూడ, మల్కాపూర్, కేసారం, ఇబ్రహీంపల్లి, దేవునిఎర్రవెల్లి, దామరగిద్ద, రామన్నగూడ, చేవెళ్ల గ్రామాలను కలిపి చేవెళ్ల మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మహేశ్వరం మున్సిపాలిటీ..
మహేశ్వరం గ్రామపంచాయతీ చుట్టుపక్కల ఉన్న మహేశ్వరం, తుమ్మలూరు, సిగిరిపురం, గంగారం, ఉప్పుగడ్డతండా, కేసీతండా, మోహబత్నగర్, ఎండీతండా, మన్సాన్పల్లి, గట్టుపల్లి, ఆకన్పల్లి, రాంచంద్రగూడ తదితర గ్రామాలను కలుపుతూ మహేశ్వరం మున్సిపాలిటీగా మార్చనున్నారు.
కందుకూరు మున్సిపాలిటీ..
కందుకూరు గ్రామపంచాయతీ చుట్టుపక్కల ఉన్న కందుకూరు, కొత్తగూడం, కొత్తూరు, గూడూరు, బైరాగిగూడ, నేదునూరు, దెబ్బడగూడ, ఆకులమైలారం, మీర్ఖాన్పేట, బేగరికంచ, అన్నోజిగూడ, రాచులూరు, తిమ్మాపూర్, గుమ్మడవెల్లి, కటికపల్లి, జైత్వారం గ్రామాలను కలుపుతూ కందుకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందనున్నది. అత్యధికంగా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోకి 16 గ్రామపంచాయతీలు రానున్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్సిటీని దృష్టిలో ఉంచుకుని మీరఖాన్పేట, ఆకులమైలారం, బేగరికంచ తదితర గ్రామాలను కందుకూరు గ్రామపంచాయతీలో కలుపుతూ మున్సిపాలిటీగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను కలుపుతూ.. మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.
జిల్లాలో 16కు చేరనున్న మున్సిపాలిటీలు..
ప్రస్తుతం రంగారెడ్డిజిల్లాలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికితోడు కొత్తగా మరో 3 మున్సిపాలిటీలు ఏర్పాటవుతుండడంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 16కు చేరనున్నది. అలాగే, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.