హయత్ నగర్, ఏప్రిల్ 28 : గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాపలాదారు, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. మరొక వ్యక్తి స్వల్పoగా గాయపడ్డారు. గొర్రెల మంద నుండి 30 గొర్రెలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్ మండల తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన రాసూరి నవీన్ (29), వృత్తిరీత్యా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, తన తండ్రి శ్రీశైలానికి 250 గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని మేపుతూ పోషిస్తుండేది. కొన్ని రోజులుగా తండ్రి ఆరోగ్యం బాగా లేనందున చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్లో చేర్పించారు.
ఆదివారం రాత్రి తండ్రి స్థానంలో నవీన్, బావమరిది శ్రీకాంత్తో కలిసి గ్రామ సమీపంలోని సంపత్ బాల్ రెడ్డి పొలంలో ఉన్న గొర్రెల మంద వద్దకు వచ్చి పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున దాదాపు 3.30 గంటలకు 20 నుండి 25 మధ్య వయసు గల దాదాపు 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో మంద వద్ద పడుకున్న వారి వద్దకు వచ్చారు. వెంటనే వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను, రూ.5 వేలు నగదును లాక్కున్నారు. నవీన్ పై కత్తులతో దాడి చేయగా అతని కుడి కన్ను, తలపై, కుడి భుజం వెనుక భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. శ్రీకాంత్ మొహంపై కూడా దాడి చేయడంతో అతని కుడికన్ను, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి.
అనంతరం వారందరూ వెంట తీసుకొచ్చిన బొలెరో వాహనంలో 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తులు హిందీ భాషలో మాట్లాడినట్లు వెల్లడించారు. సంఘటన అనంతరం బాధితులు వెంటనే గ్రామానికి వెళ్లి గ్రామస్తుల సహాయంతో 100 కు డయల్ చేశారు. విషయం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని నవీన్, శ్రీకాంత్ లను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్కు తరలించారు.
హయత్ నగర్ ఇన్స్పెక్టర్ పి నాగరాజ్ గౌడ్, సిబ్బందితో టీమ్స్ గా ఏర్పడి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ లను కూడా పరిశీలిస్తున్నారు. నేరానికి పాల్పడిన దొంగల ముఠాను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని సీఐ నాగరాజు గౌడ్ వెల్లడించారు. బాధితుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.