సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్, జగతి ఫౌండేషన్, హెల్పింగ్ స్పాట్, ఎంవీ ఫౌండేషన్ తదితర సంస్థలు మట్టితో తయారు చేసిన గణపయ్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నగరంలోని స్కూల్స్, హాస్టల్స్, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
కాలుష్య సమస్య నుంచి గట్టెక్కేందుకు బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలే ఉత్తమమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా నిమజ్జనం చేసిన తర్వాత కుంటలు, చెరువుల్లో నీటి వనరులకు ఎలాంటి హాని ఉండదని వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సహా కృత్రిమ రంగుల్లో పాదరసం, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి విషపూరిత రసాయనాలు నిక్షిప్తమై ఉంటాయని, ఇవి నేలపై చేరి తీవ్ర హాని తలపెడుతాయని తెలిపారు. కూరగాయలు, ఆకు కూరలతో పాటు నీటిలో ఉండే చేపలు, రొయ్యలు ద్వారా మనిషి శరీరంలోకి రసాయనాలు చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. క్యాన్సర్తోపాటు మూత్రపిండాలు, కాలేయం, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.