అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు నిర్వహించే పోలింగ్కు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల్లో 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 35,23,219 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 3,453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 61 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జిల్లాలో మొత్తం 9,60,376 ఓటర్లుండగా.. 1133 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అప్పగించగా.. వారు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ఉన్నతాధికారులు, మేధావులు పిలుపునిచ్చారు.
-రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. ఓటింగ్ కోసం 3,4 53 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 15,212 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. 5,483 కంట్రోల్ యూనిట్లు, 9,943 బ్యాలెట్ యూనిట్లు, 5,389 వీవీ ప్యాట్లను ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. 1,541 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా ..2,990 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మరో 822 కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఉం చుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.
పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి : ప్రతి నియోజకవర్గంలోనూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో వాహనాల్లో బయల్దేరి బుధవారం రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 13 శాఖలకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించగా.. ఇప్పటివరకు బ్యాలెట్ ఓట్లను వినియోగించుకోని వారి కోసం డిస్ట్రిబ్యూషన్ సెం టర్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ జరిగిన తర్వాత ఉద యం ఏడు గంటలకు సాధారణ పోలింగ్ ప్రక్రియ మొదలు కానున్నది. జిల్లాలో 3,453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా..దివ్యాంగులు, మహిళలు, యువతకు మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల సంఖ్య కంటే 25 శాతం అదనంగా (రిజర్వు) బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మైక్రోఅబ్జర్వర్లు 283 మంది, పీవోలు3,803 మంది, ఏపీవోలు 3,803, వోపీవోలు 7,606 కలుపుకొని మొ త్తం 15,212 మంది ని పోలింగ్ విధుల కోసం ర్యాండమైజెషన్ ద్వారా బాధ్యతలు కేటాయించారు. 20శాతం మంది రిజర్వ్డు సిబ్బందినీ అందుబాటులో ఉంచారు. 1,541 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. 2,990 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా, మ రో 822 కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏర్పా ట్లు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు ఐడీ లేకుంటే వేరే ఇతర 12 రకాల ఐ డీ కార్డులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
నియోజకవర్గాల సంఖ్య 8
బరిలో నిలిచిన అభ్యర్థులు 209
మొత్తం ఓటర్ల సంఖ్య 35,23,219
పోలింగ్ కేంద్రాలు 3,453
నియోజకవర్గాల సంఖ్య 4
బరిలో నిలిచిన అభ్యర్థులు 61
మొత్తం ఓటర్ల సంఖ్య 9,60,376
పోలింగ్ కేంద్రాలు1133
జిల్లాలోని బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు
నియోజకవర్గం – బరిలో ఉన్న అభ్యర్థులు
ఇబ్రహీంపట్నం 28
ఎల్బీనగర్ 48
మహేశ్వరం 27
రాజేంద్ర నగర్ 25
శేరిలింగంపల్లి 31
చేవెళ్ల 12
కల్వకుర్తి 24
షాద్ నగర్ 14
మొత్తం 209
జిల్లాలోని మొత్తం సెగ్మెంట్లు : 8