రంగారెడ్డి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సమన్వయ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఐక్యంగా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఫలితంగా ప్రతి కార్యక్రమమూ విజయవంతమవుతున్నది. కాంగ్రెస్, బీజేపీల్లో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. షెడ్యూల్ వచ్చినా ఎవరికి టికెట్ ఇస్తారో ? ఎవరు బరిలో ఉంటున్నారో తేల్చని దుస్థితి ఉన్నది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలతో కేడర్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేయగా, షెడ్యూల్ విడుదలతో మరింత దూకుడు పెంచింది. కార్యక్షేత్రంలో దూసుకెళ్తున్న గులాబీ ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల పర్యటనలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్పై జనాల్లో పాజిటివ్ వేవ్ పెరుగుతున్నది. గెలుపు ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి సునాయాసంగా అధికారంలోకి రావడం ఖాయమని వివిధ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు సమన్వయ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ నేతలంతా ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ప్రతి కార్యక్రమంలోనూ సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఫలితంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమం, సభలు విజయవంతం అవుతూ వస్తున్నాయి. ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల పర్యటనల్లోనూ ఐక్యతతో పనిచేసి సభలు, సమావేశాలను విజయవంతం చేశారు. కానీ.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా.. ఎవరికి టికెట్ ఇస్తారో? ఎవరు బరిలో ఉంటున్నారో తేలని దుస్థితిలో రెండు పార్టీల్లో ఉన్నది. గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు ఈ రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టికెట్ ఖరారు కాక నేతలు సైతం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు కనబడడంలేదు. అభ్యర్థులను ప్రకటించి.. టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేలోపుగా ఎన్నికల ప్రచారమే పూర్తవుతుందన్న అసహనాన్ని ఆ రెండు పార్టీల శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. వడపోతల పేరుతో కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు కాలయాపన చేస్తున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నది. మరోసారి గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్యలు పకడ్బందీగా కార్యాచరణను అమలు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని నేతలు, కార్యకర్తలను కలుపుకొని ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేశారు. నిత్యం ప్రజల మధ్యే కలియదిరుగుతున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత దూకుడును మరింతగా పెంచడంతో ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్గా మారిన కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో ఒకింత అసహనం సైతం వ్యక్తమవుతున్నది. టాప్గేర్లో దూసుకెళ్తున్న కారును అందుకోలేనంత దూరంలో ఉండడంతో బీఆర్ఎస్ మూడోసారి సునాయాసంగా అధికారంలోకి వస్తుందన్న ధీమాను వివిధ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్కే ప్రజల మద్దతు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఊరూరా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది. అభ్యర్థులు ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రతి సభకు సైతం ఊహకందని రీతిలో సబ్బండ వర్గాలు కదిలి వస్తున్నాయి. కారుకే ఓటేస్తామని బహిరంగంగానే ప్రజానీకం చెబుతున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరేషాన్లో పడుతున్నాయి. ముందు నుంచీ బలంగా ఉన్న ఉద్యమ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వడం కూడా కష్టమేననే ప్రచారం జిల్లాలో బలంగా వినిపిస్తున్నది.