వికారాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. ఒకప్పుడు అప్పో సప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస.. తాకట్టు పట్టైనా ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తే, తమ బిడ్డలు తమలాగా కష్టం చేసుకొని బతుకాల్సిన స్థితిరాదని ఆశ.. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.. పక్కా భవనాలు, విశాలమైన ప్రాంగణాలు, నాణ్యమైన విద్య, సాంస్కృతిక, క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ, పౌష్టికాహారం, ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణతో గురుకులాలు శోభిల్లుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 33 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు సకల సౌకర్యాలు, నాణ్యమైన విద్యతో కార్పొరేట్కు దీటుగా ఫలితాలు రాబడుతున్నాయి. రాష్ట్ర సర్కార్ ఒక్కో విద్యార్థి కోసం ఏటా రూ.1.30 లక్షలను వెచ్చిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. దీంతో గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. గతేడాది ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉన్న గురుకులాలు ఈ ఏడాది నుంచి డిగ్రీ విద్యను సైతం అందుబాటులోకి తెచ్చారు. అన్ని వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తున్నది. ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వాలు విస్మరించిన విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు దాసోహం కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల వసతులను కల్పించేందుకు గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గురుకుల పాఠశాలల్లో బోధనకు అర్హత, అనుభవజ్ఞులైన వారిని నియమించడంతోపాటు ఒక్కో విద్యార్థికి ప్రతి ఏటా రూ.1.30 లక్షలను వెచ్చిస్తున్నది. దీంతో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పోటీపడుతుండడం గమనార్హం.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా..
అటు విద్యా బోధనలోనూ, వసతులను కల్పించడంలోనూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను కల్పించారు. ఆంగ్ల బోధన, మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం పూరీ లేదా చపాతి, మధ్యాహ్న భోజనంలో బగారా అన్నం, తెల్లన్నం, మటన్ లేదా చికెన్, గుడ్డు పులుసు, పప్పు, వెజ్ ఫ్రై, సాంబర్, పెరుగుతో రోజుకో రకమైన వంటకం., సాయంత్రం పల్లీ పట్టి, బాయిల్డ్ పల్లీలు., రాత్రికి అన్నం, వెజిటేబుల్ కర్రీ, చట్నీ, రసం, మజ్జిగ, సీజనల్ పండ్లను అందిస్తున్నారు. అన్ని అర్హతలతోపాటు అనుభవజ్ఞులైన వారిచే విద్యాబోధన జరుగుతున్నది. విద్యార్థులకు ఆటలతోపాటు యోగాను నేర్పిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛతలోనూ గురుకుల పాఠశాలలు మేటిగా ఉండడం గమనార్హం. గురుకుల విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ వంటి పరీక్షల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
33కు చేరిన గురుకుల పాఠశాలలు
జిల్లాలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల సంఖ్య 33కు చేరింది. మొదట ఐదు, ఆరు, ఏడు తరగతుల నుంచి ఏడు గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా.. ప్రతి ఏటా ఒక్కో తరగతిని అప్గ్రేడ్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో డిగ్రీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. గతేడాది వరకు ఇంటర్మీడియట్ వరకు కొనసాగగా, ఈ ఏడాది డిగ్రీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్యతోపాటు దుస్తులు, ఉచిత భోజనం, వసతి, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, పెన్నులు, పెన్సిళ్లు, విద్యార్థులు పడుకునేందుకు మంచాలను కూడా ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో ఎస్టీ గురుకుల పాఠశాలలు నాలుగున్నాయి. ఈ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తున్నారు. పరిగి బాలికల గురుకుల పాఠశాలలో 540 మంది, తాండూరు బాలికల గురుకుల పాఠశాలలో 560, కులకచర్ల బాలుర గురుకులంలో 540, కొడంగల్ బాలుర గురుకులంలో 500 మంది విద్యార్థులున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు ఆరు ఉండగా, కాలేజీలు ఆరు ఉన్నాయి. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1846 మంది విద్యార్థులు చదువుతుండగా, జూనియర్ కాలేజీల్లో 960 మంది విద్యనభ్యసిస్తున్నారు. మిగతా 15 గురుకుల పాఠశాలలు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందినవి.
గురుకులాల్లో నాణ్యమైన విద్య; కుమ్మరి ప్రజాపతి, బొంరాస్పేట
ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుతున్నది. నా కూతురు పరిగిలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదువుతున్నది. నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, వసతి కల్పిస్తున్నారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతో పేద విద్యార్థులు విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మా లక్ష్యం ; స్వప్న, ప్రిన్సిపాల్(ఎఫ్ఏసీ), మహాత్మా జ్యోతీబాపూలే తెలంగాణ
వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, తాండూరు100 శాతం నాణ్యమైన విద్యను గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్నది. దేశంలో అత్యధిక గురుకులాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా జ్యోతీబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని జూలై 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మా పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యానికి చక్కని హైజెనిక్ పుడ్ను అందిస్తున్నాం. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మా లక్ష్యం. విద్యార్థులకు విద్యతో పాటు మోరల్ వాల్యూస్ను నేర్పిస్తున్నాం. ఐఐటీ, నిట్ కోసం ప్రత్యేక విద్యాబోధన అందించే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎంపిక కోసం తొమ్మిది, పది తరగతుల విద్యార్థుల కోసం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పరీక్షను నిర్వహిస్తున్నాం. నాణ్యమైన విద్యతో పాటు మా విద్యార్థులకు ఉన్నత చదువుల్లో మెరుగైన ప్రతిభను కనబర్చేలా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం.
ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ; బ్యాగరి శేఖర్, విద్యార్థిని తండ్రి, తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూ.కళాశాల, తాండూరు
గురుకుల పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం ఏటా లక్ష ఖర్చు చేస్తూ దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, పెన్నులు, పెన్సిళ్లు, విద్యార్థులు పడుకునేందుకు మంచాలు ప్రభుత్వం అందిస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్ధులందరికీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రకటించిన కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి నాణ్యమైన విద్యనందిస్తున్నారు.
నూతన ఒరవడిలో గురుకులాలు
– మహబూబ్ ఫాతిమా, ఇన్చార్జి ప్రిన్సిపాల్, తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూ.కళాశాల, తాండూరు
ధనిక, బీద అనే తారతమ్యాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన, నెలకొల్పుతున్న గురుకులాలతో రాష్ట్రంలో విద్యా రంగంలో పెను మార్పులు వచ్చాయి. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పొరేట్ స్థాయి విద్యను ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాల ద్వారా అందించడం హర్షణీయం. ముఖ్యంగా మా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు డిజిటల్ విద్యను అందిస్తున్నాం. స్పెషల్ సబ్జెక్ట్ రోబోటిక్ విద్య, వాల్యూ ఎడ్యుకేషన్తోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందిస్తున్నాం. మా ఆవరణలో ప్రతి విద్యార్థి ఆంగ్లంలోనే మాట్లాడుతారు.