సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిజ్ఞానాన్ని అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది. పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాన్ని పెంపొందించడానికి పఠనోత్సవాన్ని సైతం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి 15వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నది. వికారాబాద్ జిల్లాలో 1063 పాఠశాలలు ఉండగా, 92,500 మంది విద్యార్థులు ఉన్నారు. ‘మన ఊరు-మనబడి’ కింద జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన 154 పాఠశాలల్లో ప్రభుత్వం రీడింగ్ కార్నర్లనూ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పాఠశాలలకు 36,960 కథలు, నీతి పుస్తకాలను విద్యా శాఖ సరఫరా చేసింది. పిల్లలకు బొమ్మలను చూపించడం, మాట్లాడించడంతో పాటు నీతి కథలు, నైతిక విలువలు బోధించడంపై ఆసక్తి కలిగించేలా బోధన చేయడమే రీడింగ్ కార్నర్ల ఉద్దేశం.
– బొంరాస్పేట, జూలై 9
బొంరాస్పేట, జూలై 9 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి సమాజంలో అవసరమయ్యే పరిజ్ఞానాన్ని అందించడానికి విద్యాశాఖ కృషి చేస్తుంది. కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్లో పఠనా నైపుణ్యం పెంపొందించడానికి విద్యాశాఖ ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పఠనోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి 15వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. వీటిని పక్కాగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని 771 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 176 ఉన్నత పాఠశాలల్లో సోమవారం నుంచి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడానికి ఉపాధ్యాయులు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమం అమలులో భాగంగా ఐదు రోజులపాటు రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలను కూడా విద్యాశాఖ రూపొందించి ఎంఈవోలకు పంపిణీ చేసింది.
రోజువారి కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 10వ తేదీన పఠనోత్సవం గ్రంథాలయ వారోత్సవాలను సూచిస్తూ ఒక ఫ్లెక్సీని తయారు చేసి పాఠశాలలో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరైనా ప్రముఖ వ్యక్తితో పిల్లలకు అవగాహన కల్పించి పుస్తక పఠనం చేయిస్తారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
11వ తేదీన పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఇంటింటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ చేపడుతారు. పుట్టినరోజు వంటి వివిధ సందర్భాల్లో పిల్లలకు బహుమతిగా పుస్తకాలను అందజేసేలా
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
12, 13వ తేదీల్లో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి పుస్తకాలను సేకరించే కార్యక్రమం నిర్వహిస్తారు. దాతల నుంచిగాని, పాఠశాల ఉపాధ్యాయుల ఇండ్లలో ఉండే వివిధ రకాల కథల పుస్తకాలు, వార్తా పత్రికల్లో పిల్లల పేజీల్లో ఉండే కథలు, బొమ్మలు వివిధ రకాల ఫజిల్స్ వంటి వాటిని సేకరించనున్నారు. వీటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు.
14న పఠన సామగ్రి అభివృద్ధి
విద్యార్థులతో పేపర్ కటింగ్స్ లేదా కార్టూన్స్, ఫజిల్స్ మొదలైన రీడింగ్ కార్డ్స్ని ఒక్కో పాఠశాలకు వంద చొప్పున స్వయం అభ్యాసన సామగ్రిని తయారు చేయించి అందుబాటులో ఉంచుతారు.
15న తల్లిదండ్రుల సమావేశం
వారోత్సవాల చివరి రోజు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులతో పుస్తక పఠనం చేయిస్తారు. పిల్లలకు పఠన పోటీలు నిర్వహించనున్నారు. పఠన పోటీల్లో భాగంగా పిల్లలతో కథలు చదివించడం, పుస్తక సమీక్ష, పిల్లలు సొంతంగా కథలు చెప్పడం వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. వేగంగా తప్పులు లేకుండా చదవగలగడం అనే అంశంలో కూడా పోటీలు ఉంటాయి.
జిల్లాలోని 154 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటు
విద్యాభివృద్ధికి మన ఊరు-మనబడి పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చుచేసి వసతులు కల్పిస్తుంది. విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించడానికి విద్యాశాఖ మన ఊరు-మనబడి కింద జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 154 పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసింది. విద్యా దినోత్సవం సందర్భంగా గత నెల 20వ తేదీన వీటిని ప్రారంభించారు. రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేసిన ఒక్కో పాఠశాలకు 240 పుస్తకాల చొప్పున 154 పాఠశాలలకు 36,960 కథలు, నీతి పుస్తకాలను సరఫరా చేశారు. చిన్న తరగతులకు బొమ్మలు ఎక్కుగా ఉండి వాక్యాలు తక్కువగా ఉండే పుస్తకాలను, పెద్ద తరగతుల వారికి వాక్యాలు ఎక్కువగా ఉండి బొమ్మలు తక్కువగా ఉండే పుస్తకాలు ఉన్నాయి. పిల్లలకు బొమ్మలను చూపించడం, మాట్లాడించడంతో పాటు నీతి కథలు, నైతిక విలువలు బోధించడంపై ఆసక్తి కలిగించేలా బోధన చేయడమే రీడింగ్ కార్నర్ల ఉద్దేశం.
అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తాం..
పఠనోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తాం. ఈ మేరకు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. రోజువారి కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలి. గ్రంథాలయ వారోత్సవాల వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుంది. ఇప్పటికే మన ఊరు-మనబడి పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం అందిస్తున్నాం. విద్యార్థులు వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలి.
-రేణుకాదేవి, డీఈవో