రెండో జాబితా వెలువడిన తర్వాత రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి గళం వినిపిస్తున్నది. భంగపడిన నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు అధిష్టానం మహేశ్వరానికి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నానికి మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. చేవెళ్ల టికెట్ను భీం భరత్కు కేటాయించడంతో టికెట్ కోసం పోటీపడ్డ పీసీసీ సభ్యుడు రాచమల్ల సిద్దేశ్వర్ వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలు తమ అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఆయా అభ్యర్థిత్వాలపై పునరాలోచించాలని అధిష్టానానికి ఆల్టిమేటమ్ జారీ చేస్తున్నారు. చిచ్చు రేపిన రెండో జాబితాతో అసమ్మతి నేతల దారెటు? అన్నదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టికెట్ దక్కనివారు ఏం చేస్తారనే ఉత్కంఠత పార్టీ వర్గాల్లో నెలకొన్నది.
– రంగారెడ్డి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో చిచ్చు రేపుతున్నది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతిరాగం అందుకుంటున్నారు. రెండో జాబితాలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయగా.. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఆయా అభ్యర్థిత్వాలపై పునరాలోచించాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు తమ అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసమ్మతి నేతల దారెటు?
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రెండు జాబితాలను విడుదల చేయగా.. అక్టోబర్ 15న విడుదల చేసిన మొదటి జాబితాలో చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన రెండో జాబితాలో మహేశ్వరానికి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నంకు మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. నిన్నమొన్నటివరకు ఆయా నియోజకవర్గ కాంగ్రెస్లో నెలకొన్న ముసలం కాస్తా.. టికెట్ల ఖరారుతో భగ్గుమన్నది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి మొత్తం ఏడుగురు నేతలు పోటీపడ్డారు. వీరిలో మల్రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం మల్రెడ్డి రంగారెడ్డి వైపే మొగ్గు చూపడంతో దండెం రాంరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన అనుచరులతో కలిసి మీడియా ముఖంగా గోడు వెళ్లబోసుకున్నారు.
చివరి నిమిషం వరకు తన పేరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉన్నదని, కొందరు జిమ్మిక్కులు, కుట్రలు చేసి తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని అధిష్టానానికి అల్టిమేటమ్ జారీ చేసిన ఆయన కార్యకర్తలతో మరోసారి చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెబుతున్నారు. కిచ్చెనగారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయింపుపై మహేశ్వరం నియోజకవర్గంలోని అసమ్మతి నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి, మరో నేత దేప భాస్కర్రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరు సైతం తమ అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. నేడోరేపో తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కక భంగపడ్డ నేతలు ఏం చేస్తారనే.. ఉత్కంఠత పార్టీ వర్గాల్లో నెలకొంది. చేవెళ్ల టికెట్ను భీం భరత్కు కేటాయించడంతో టికెట్ కోసం పోటీపడ్డ పీసీసీ సభ్యుడు రాచమల్ల సిద్ధేశ్వర్, భీంభరత్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉంటానని చెబుతున్న ఆయన ఇటీవలనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసి భీంభరత్ అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని కోరారు.
ఇబ్రహీంపట్నం టికెట్ దక్కని దండెం రాంరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఆశావహులు చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి, నేత దేప భాస్కర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని క్యాడర్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో ఉంటారా? లేక కాంగ్రెస్లోనే కొనసాగుతారా? అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని బుజ్జగించినప్పటికీ పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రచారం చేస్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకమవుతున్నది.