కోట్పల్లి, డిసెంబర్ 30 : తెలంగాణ సర్కార్ యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. గతంలో యువతకు క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు లేకపోవడంతో యువత క్రీడలకు దూరమయ్యారు. క్రీడా ప్రాంగణాలుంటే చాలా మంది మారుమూల ప్రాంతాల యువత క్రీడల్లో ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయి క్రీడల్లో చేరేవారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు అందుబాటులో ఈ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే ఎంతో మందిని మట్టిలోని మాణిక్యాలను బయటకు తేవచ్చని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా మండలంలో 18 పంచాయతీలుండగా ఒక్కో పంచాయతీకి 1 ఎకరం ప్రభుత్వ స్థలంలోనే క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి యువతకు అన్ని వసతులను కల్పిస్తున్నది.
18 క్రీడా ప్రాంగణాలకు గాను ఇప్పటి వరకు 14 క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని కేటాయించి, ప్రాంగణ నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. ఇంక మండలంలో ని జిన్నారం, ఓగ్లాపూర్, లింగంపల్లి, కంకణాలపల్లి గ్రామాల్లో స్థలం లేక ప్రాంరంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మిగిలిన నాలుగు క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని కేటాయించి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
క్రీడా ప్రాంగణాల పనులు కొనసాగుతున్నాయి
గ్రామీణ ప్రాంత యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగానే మండలంలోని 18 పంచాయతీలకు 18 క్రీడా ప్రాంణాలను ఏర్పాటు చేసి, అందులో 14 క్రీడా ప్రాంగణాలను వివిధ దశల్లో నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. త్వరలోనే పూర్తి అవుతాయి. ఇంకా 4 పంచాయతీల్లో స్థలం లేక నిలిచిపోయాయి. త్వరలోనే స్థలాన్ని కేటాయించి క్రీడా ప్రాంగణాల పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం.
– కె.లక్ష్మీనారాయణ, ఎంపీడీవో కోట్పల్లి
క్రీడా స్ఫూర్తికి ప్రభుత్వం కృషి
మారుమూల గ్రామాల్లోని యువతకు క్రీడలపై ఆసక్తి ఉన్నా.. వసతులు లేక చాలా మంది యువత క్రీడల్లో రాణించడం లేదు. గ్రామీణ ప్రాంత యువతల్లో ఉన్న ప్రతిభను గుర్తించిన తెలంగాణ సర్కార్ పంచాయతీకో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడం చాలా సంతోషం. ప్రభుత్వం యువతకు ఇచ్చిన చేయూతపై నేడు గ్రామా గ్రామాన యువకులు సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు.
– శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎన్కెపల్లి