ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు చెరువులు, కుంటల్లోకి చేరుతున్న వర్షపు నీరు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
షాబాద్, జూలై 21 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు చందనవెళ్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను ఎంపీడీవో అనురాధ పరిశీలించారు. మల్లారెడ్డిగూడ గ్రామంలో వర్షాలకు కూలిపోయిన ఇండ్లను సర్పంచ్ చందిప్ప జంగయ్య పరిశీలించారు. షాబాద్ పహిల్వాన్ చెరువు నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది.
నందిగామ : నందిగామ, కొత్తూరు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు ప్రవహిస్తున్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ, నర్సప్పగూడ వాగులు ఉధృతంగా ప్రహిస్తుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో వర్షపు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. మండలంలోని అయ్యవారిపల్లి వాగులోకి భారీగా వర్షం నీరు చేరింది. పురాతన ఇండ్లలో నివసించవద్దని గ్రామసర్పంచ్ లక్ష్మీరమేశ్ గ్రామస్తులకు సూచించారు.
కేశంపేట : కేశంపేట మండలంలోని అల్వాల, పాటిగడ్డ, కేశంపేట, లేమామిడి, కాకునూరు, తొమ్మిదిరేకుల, లింగంధన గ్రామాల మీదుగా ఉన్న పెద్ద వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు నిండి అలుగులు పారుతున్నాయి. కేశంపేటలోని శ్రీవెంకటేశ్వర చెరువులో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. వేములనర్వ, ఇప్పలపల్లి, పాపిరెడ్డిగూడ, కాకునూరు, నిర్దవెళ్లి, కొత్తపేట తదితర గ్రామాల్లో చెరువుల్లోకి నీరు చేరింది. మండలంలో శుక్రవారం ఉదయం వరకు 88.7 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పుట్టోనిగూడెం గ్రామ పరిధిలోని కంకరాళ్లతండాలో వర్షాలకు వాంక్డావత్ మన్ని ఇల్లు కూలిపోయింది.
మొయినాబాద్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం భారీగా వర్షం కురవడంతో ఈసీ, మూసీ వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈసీ ఎగువ ప్రాంతాలైన షాబాద్, చేవెళ్ల, పూడూరు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం, అదే విధంగా మూసీ నది ఎగువ ప్రాంతాలైన శంకర్పల్లి, నవాబ్పేట, వికారాబాద్, అనంతగిరి కొండల్లో భారీ వర్షం కురవడంతో వరద నీరు భారీగా నదుల్లోకి చేరుతున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అమ్డాపూర్ గ్రామం వద్ద ఈసీ నది వరద పోటెత్తింది. నదికి ఇరువైపులా ఉన్న పంటలు జలమయమయ్యాయి. గోపులారం మధ్య ఉన్న ఈసీ వాగు ప్రవహించింది.