ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాగా, వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో తొలి విడుతకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మొదట మూడు పీహెచ్సీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో రామయ్యగూడ, యాలాల, దోమ పీహెచ్సీలు ఎంపిక కాగా, వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు త్వరలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పీహెచ్సీలలో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫొలిక్యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బి12, విటమిన్-డి పరీక్షలు, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు చికిత్సను అందించనున్నారు. ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించేలా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకోనున్నది.
వికారాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నది. తాజాగా రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆరో గ్య మహిళా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మహి ళా ఆరోగ్యంగా ఉండేందుకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా పథకం అమల్లోకి రాగా, త్వరలో మరిన్ని పీహెచ్సీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అయితే ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తొలి విడుతలో జిల్లా ను ఎంపిక చేయలేదు. అయితే త్వరలో చేపట్టనున్న రెండో విడుత ఆరోగ్య మహిళా పథకాన్ని జిల్లాలో నిర్వ హించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో డీఎంహెచ్వో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా రు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారానికి ఒకరోజు ప్రత్యేకంగా మహిళలకు క్యాన్సర్ నిర్ధ్దారణ, డయాగ్నోస్టిక్ పరీక్షలతోపాటు 8 రకాల అనారోగ్య సమస్యలకు వైద్య సేవలందించనున్నారు.
ఆరోగ్య మహిళా పథకం కింద జిల్లాలో మొదటి విడుతలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(రామయ్యగూడ, యాలాల, దోమ)లను అధికారులు ఎంపిక చేశారు. త్వరలోనే వీటిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రానున్నారు. ఇప్పటికే మూడు పీహెచ్సీల్లోని వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్వో డాక్టర్ పల్వన్కుమార్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే రామయ్యగూడ, యాలాల, దోమ పీహెచ్సీల పరిధిలోని మహిళలకు ప్రతి మంగళవారం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తదనంతరం జిల్లాలోని మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళా సం పూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మహి ళా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం కింద జిల్లాలోని యాలాల, రామయ్యగూడ, దోమ పీహెచ్సీలను ఎంపిక చేశాం. త్వరలోనే ఈ మూడు పీహెచ్సీల్లో ఆరోగ్య మహి ళా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. మహిళలకు సంబంధించి ప్రధానమైన 8 రకాల సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలందిస్తాం.
– డా.పల్వన్కుమార్, డీఎంహెచ్వో వికారాబాద్