హుస్నాబాద్ టౌన్, ఆగస్టు 8 : వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చోటుదక్కింది. హుస్నాబాద్ పట్టణంలోని ఇండ్లు, ఖాళీస్థలాలను గుర్తించే పనికి మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 11వేలకుపైగా ఇండ్లు, ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు.
సదరు యజమానుల ఆస్తులను గుర్తించి వారికి సంబంధించిన ఇంటిపన్ను రసీదు, కరెంట్బిల్లు, ఆధార్కార్డు, సదరు వ్యక్తికి సంబంధించిన సెల్ఫోన్నంబర్, ఇంటికి సంబధించిన ఫొటోను సైతం ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. ఖాళీస్థలాలు ఉంటే వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను సైతం సేకరించే పని పట్టణంలో జోరుగా సాగుతున్నది. దీనికోసం 17బృందాలు పనిచేస్తున్నాయి. ఇందులో మున్సిపల్,మెప్మా సిబ్బంది ఉన్నారు. మున్సిపల్ అధికారిక లెక్కల ప్రకారం 7వేలకుపైగా ఇండ్లు ఉండగా, ఇందులో దాదాపు 3వేలకుపైగా ఇండ్లకు సంబంధించిన నక్షచిత్రాల సేకరణను అధికారులు పూర్తిచేశారు. ఇచ్చిన టార్గెట్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఖాళీస్థలాల యజమానులను గుర్తించే ప్రక్రియలో ఒకింత ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
నక్ష కార్యక్రమాన్ని పూర్తిచేసిన తర్వాత ఇండ్ల యజమానులకు ప్రత్యేకంగా ఒక స్మార్ట్కార్డును సైతం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటిఫొటో, ఇంటినంబర్, కరెంట్మీటర్ నంబర్తో పాటు పూర్తివివరాలను అందులో పొందుపరిచేందుకు నక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా ఖాళీస్థలాల యజమానులకు సైతం భూమిని విక్రయించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇచ్చిన టార్గెట్ను పూర్తిచేసేందుకు సరైన సిబ్బంది, ఖాళీస్థలాల యజమానులు అందుబాటులో లేకపోవడంతో వందశాతం అమలు కావడం సాధ్యంకాదనే చెప్పవచ్చు.