రైతు బాగుంటేనే అందరూ మంచిగా ఉంటారని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ ఆదుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తొమ్మిది గంటలపాటు విద్యుత్తును అందించగా.. 2017 జనవరి 1 నుంచి 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సరిగ్గా ఈ తేదీకి వరకు ఐదేండ్లు పూర్తవుతున్నది. నిరంతర విద్యుత్తు సరఫరాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వికారాబాద్ జిల్లాలో గతంలో 4.80 లక్షల ఎకరాలు సాగుకాగా.. ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుతం రోజుకు 3.78 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుండగా.. ఏడాదికి 1,379 మిలియన్ యూనిట్లు ఖర్చవుతున్నది.
జిల్లాలో మూడు లక్షల వరకు విద్యుత్తు కనెక్షన్లుండగా అందులో 75 వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి. నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా జిల్లాలో రూ. వంద కోట్లతో సబ్ స్టేషన్లు, కొత్త విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేశారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర విద్యుత్తుతో వ్యవసాయం పండుగలా మారిందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో గతంలో 70వేల ఎకరాల్లో వరిపంట సాగుకాగా, గతేడాది 1.20 లక్షల ఎకరాలు, ఈసారి 1.50లక్షల ఎకరాలకు వరి సాగు పెరిగింది.
వికారాబాద్, డిసెంబర్ 31, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలుత ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి 3 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు నిర్ణయించి అమలు చేసింది. తదనంతరం రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందడం తదితర ఇబ్బందికర ఘటనలతో పగటిపూటనే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా చేసింది. 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం.. 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నది. నేటితో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరాకు ఐదేండ్లు పూర్తయ్యింది.
జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకుగాను రూ.100 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయానికి 24 గంటలపాటు విజయవంతంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. మరోవైపు గతంలో వానకాలం సీజన్లోనూ సరిగ్గా విద్యుత్తు సరఫరా ఉండేది కాకపోగా, అధికారికంగా విద్యుత్తు సరఫరా చేయాల్సిన సమయంలోనూ కోత విధించి రైతులకు పూర్తిగా నష్టం కలిగించే వారు, అంతేకాకుండా బావుల్లో, బోరుల్లో నీరున్నా.. విద్యుత్తు సరఫరా లేక పంటలను నష్టపోయేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి అన్నదాతలకు వ్యతిరేక విధానాలను అవలంబించేందుకు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతన్నల సంక్షేమం నిమిత్తం నిరంతర కరెంట్ను సరఫరా చేస్తున్నది.
ఐదేండ్లుగా నిరంతర విద్యుత్తు..
వికారాబాద్ జిల్లాలో గత ఐదేండ్లుగా వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను రూ.100 కోట్లతో కొన్ని సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్త లైన్లను వేయడం, మెగా ఓల్ట్ ఆంపియర్ల సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాకు ముందు జిల్లాలో 400 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, ప్రస్తుతం ఏడాదికి 1379 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రోజుకు ప్రస్తుతం 3.78 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, వేసవిలో 4-5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది.
తాండూరు, కొడంగల్, పుట్టపహాడ్, వికారాబాద్, పరిగి 132/23 కేవీ సబ్ స్టేషన్ల నుంచి 53.85 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, 132 కేవీ సబ్ స్టేషన్ల ద్వారా 42.66 మిలియన్ యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ప్రైవేట్ పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు సంస్థల ద్వారా 15 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. జిల్లాలో కొత్తగడి, పీరంపల్లి, నస్కల్, పూడూరు, పరిగి, కొడంగల్, పెద్దేముల్ తదితర ప్రాంతాల్లో సోలార్, పవన విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకుగాను కొత్తగా 58 33/11 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. 5 ఎంఏలుగా (మెగాఓల్ట్ ఆంపియర్) ఉన్న సామర్థ్యాన్ని 8 ఎంఏలుగా మార్చి కొత్తగా 228 మెగా ఓల్ట్ ఆంపియర్లను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని వికారాబాద్లో రెండు కొత్త లైన్లు, తాండూరు 2 కొత్త లైన్లు, పరిగిలో ఒక కొత్త లైన్ను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 213 ఫీడర్లుండగా, వీటిలో 155 వ్యవసాయానికి సంబంధించిన ఫీడర్లు ఉన్నాయి. ఫీడర్ నుంచి ఫీడర్కు కొత్తగా 45 కొత్త లైన్లను ఏర్పాటు చేశారు. ఫీడర్ల మధ్య కొత్త లైన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ఉన్నచోట అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 50 వరకు ట్రాన్స్ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన ఇతర కారణాలతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు ఒక్కో డివిజన్కు ఒక్కో ప్రత్యేక బృందాలను జిల్లా విద్యుత్తు శాఖ ఏర్పాటు చేసింది.
జిల్లాలో 3 లక్షల విద్యుత్తు కనెక్షన్లుండగా, వీటిలో 75 వేలు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా పోల్స్ వేయాల్సిన అవసరం లేనట్లయితే 4-5 రోజుల్లో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ను మంజూరు చేస్తున్నారు. ఒకవేళ కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్తోపాటు పోల్స్ వేయాల్సి వస్తే మూడు మాసాల సమయం పడుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం…
నిరంతర విద్యుత్తు సరఫరాతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో 4.80 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. కరెంట్ సరఫరా సరిగ్గా ఉండకపోవడంతో వరి సాగుకు బదులు ఆరుతడి పంటలను వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఒక్క తడికి మాత్రమే నీరందించే పరిస్థితులతో పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు.
నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు మిషన్కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టడం తదితరాలతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీంతో జిల్లాలో ప్రధానంగా వరి సాగు ఊహించని విధంగా పెరిగింది. నాలుగేండ్లలో 1.20 లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగు పెరుగగా, లక్ష ఎకరాల్లో వరి సాగు పెరుగడం గమనార్హం. జిల్లాలోని కులకచర్ల, దోమ, బొంరాసుపేట్, దౌల్తాబాద్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది.
రంగారెడ్డి జిల్లాలో అధిగమించిన అధిక లోడు సమస్య
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 31 : సీమాంధ్ర పాలకుల హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. పేరుకే ఉచిత విద్యుత్.. అది కూడా కొన్ని గంటలే. ఉదయం ఉంటే రాత్రి ఉండదు.. రాత్రి ఉంటే పగలు ఉండదు.. రాత్రులు బావుల కాడికి వెళ్లి పాము కాటుకు గురైన సంఘటనలు ఉన్నాయి. త్రీఫేజ్ కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక రైతులు నిద్రపోయేవారు కాదు. ఇండ్లకు ఇచ్చే కరెంటు అంతంతే ఉండేది. ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని నాడు వలస పాలకులు వెక్కిరించారు. కాని పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరంతర కరెంట్ సరఫరా అవుతున్నది. నిరంతరాయంగా కరెంటు సరఫరాతో వ్యవసాయంతో పాటు చిన్న పరిశ్రమలపై ఆధారపడిన వారికి చేతినిండా పని దొరుకుతున్నది.
రెప్పపాటు కూడా పోని కరెంటు..
రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో సబ్స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చి అధికలోడు సమస్యను అధిగమించారు. కారిపోతున్న ఆయిల్తో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి కొత్తవాటిని బిగించారు. కొత్త విద్యుత్ స్తంభాలు బిగించి ఎల్ఈడీ లైట్లను వేశారు. సెలూన్, లాండ్రీషాపులకు ఉచిత విద్యుత్ అందుతున్నది. తెలంగాణాలో గృహ, వ్యాపార అవసరాలతో పాటు వ్యవసాయ రంగానికి కోతలు లేని కరెంటు సరఫరా అవుతున్నది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉంటుండడంతో చిన్నతరహా పరిశ్రమలు సాఫీగా సాగుతున్నాయి.
వినియోగం పెరిగినా అంతరాయం లేదు..
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా అవుతున్నది. విద్యుత్తు వినియోగం పెరిగినా కరెంటు నిరంతరం సరఫరా అవుతున్నది. ఎలాంటి అంతరాయం లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో పారిశ్రామిక రంగ కార్మికులకు చేతినిండా పని దొరుకడంతో పాటు యాజమాన్యాలు లాభాలను గడిస్తున్నాయి. విద్యుత్తు అధిక వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు. మరమ్మతులు పనుల కోసం కరెంటు కట్ అవుతుందే తప్పా… కరెంటుకు ఇబ్బందులు అయితే లేవు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో గతంలో 60 నుంచి 70వేల ఎకరాల్లో వరిపంట సాగయ్యేది. వానలు బాగా పడడం, నిరంతర విద్యుత్తుతో సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 1.20 లక్షల ఎకరాలు సాగు కాగా, ఈసారి 1.50లక్షల ఎకరాలకు సాగు పెరిగింది. దీనికి తోడూ కూరగాయల సాగు గణనీయంగా పెరిగింది.
కరెంట్ కష్టాలు లేవు..
స్వరాష్ర్టం వచ్చినప్పటి నుంచి కరెంట్ కష్టాలు లేవు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేయడం సంతోషకరం. రాష్ట్రం రాక ముందు టెక్నికల్ సమస్య వస్తే రోజులు పట్టేది. ఇప్పుడు నిమిషాలు, గంటల్లో సమస్యను పరిష్కరించి విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇటు నీళ్లు పుష్కలం, అటు కరెంట్ ఫుల్.. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
– రాములు, మాదారం గ్రామ మాజీ సర్పంచ్, నవాబుపేట మండలం
పడిగాపులు కాసే బాధలు తప్పినయ్..
రాష్ట్రం రాక ముందు ఒక గంట కరెంట్ ఇస్తే.. మూడు,నాలుగు గంటలు బంద్ ఉండేది. మళ్లీ కరెంట్ వస్తే మోటరు పెట్టుకునేందుకు బావులకాడ పడిగాపులు కాసేది. ఇప్పుడా కష్టం తీరింది. రోజంతా కరెంట్ వస్తుండడంతో పొద్దునపూట పొలాన్ని చూసుకుంటే సరిపోతుంది. కూరగాయలు, ఉల్లిగడ్డ సాగు చేస్తున్నా. కరెంట్ పుష్కలం కాబట్టి అవసరమున్నప్పుడు మోటరు పెడుతున్నా.
– జైపాల్, పంచలింగాల్
గత ప్రభుత్వంలో పంటలు ఎండిపోయేవి..
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ సక్కగ లేక పంటలు ఎండిపోయేవి. రాష్ట్రం ఏర్పడినాక నిరంతర ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ప్రాణమొచ్చింది. 1.20 ఎకరాల పొలంలో కూరగాయలు పండిస్తున్నా. వర్షాలు బాగా పడడంతో బోరుబావిలో నీరు పుష్కలంగా ఉన్నది. రోజంతా కరెంటు ఉంటుండడంతో నీళ్లకు ఏ బాధలేదు. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– డప్పు రత్నయ్య, మర్పల్లి
వ్యవసాయం సస్యశామలం..
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్తు సరఫరాతో వ్యవసాయం సస్యశామలంగా మారింది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. రాత్రిపూట కరెంట్ సరఫరాతో ఇబ్బందులకు గురయ్యేది. ఇప్పుడు రాత్రి సమయంలో పొలం కాడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పొద్దంతా కరెంటు ఉంటది కాబట్టి సరిపడా నీటిని పొలానికి పారబెట్టి ఇంటికి పోతున్నా. నిరంతర కరెంట్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది.
– దేవేందర్రెడ్డి, కొమరబండ, షాబాద్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ సక్కగ లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనేది. పగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంటు ఇస్తే పొలం తడిపారక ఎండిపోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కరెంట్ కష్టాలు తీరినయ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలానికి సరిపడా నీళ్లు అందుతున్నయ్. రాత్రిళ్లు బావుల వద్ద ఉండాల్సిన బాధలు తప్పినయ్. సీఎం కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటాం.
– పి.అంజయ్య, కుమ్మరిగూడ, షాబాద్
కరెంటు కోతలు లేవు..
ఆంద్రోళ్ల పాలన ఉన్నప్పుడు కరెంటు సక్కగా ఉండేదికాదు. ఇంటికి వస్తే కరెంటు రాగానే పొలంకాడికి పోయే సరికి కరెంటు మల్లా పోయేది. అలా పొద్దు, మాపు పదిసార్లు తిరిగేటోన్ని. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వచ్చినంక కరెంటే పోతలేదు. బాయికాడ స్టాటర్ల ఆటోమెటిక్ పెట్టి నిమ్మలంగా ఇంటికాడ పండుకుంటున్న. పొద్దుగాల పోయేసరికి పంటపొలం మంచిగ పారుతున్నది. ఏ కష్టంలేదు. ముఖ్యమంత్రి సారుకు రుణపడి ఉంటాం.
– గన్నాబాయ్, పటేల్చెర్వుతండా
దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నా..
మారి వ్యవసాయ కుటుంబం. నేను తుర్కగూడలోని నాకున్న పొలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు వరిపంటను సాగుచేసుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాయితీపై ఎరువులు, పంటలకు 24గంటల ఉచిత కరెంటు, పంటలకు పెట్టుబడి సాయం ఇస్తుండటంతో ధర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ప్రత్యేక రాష్ట్రంలోముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు.
– ఏనుగు బుచ్చిరెడ్డి, తుర్కగూడ